నోరు విప్పని రమణదీక్షితులు: సంఘనటకు రాజకీయ రంగు
తిరుపతి: తిరుమల ప్రధానార్చకుడు రమణ దీక్షితులుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నోటీసులు జారీ చేయడం రాజకీయ రంగును పులుముకుంటోంది. టిటిడి ఇచ్చిన నోటీసులపై రమణ దీక్షితులు నోరు విప్పడం లేదు. కానీ, అది కాస్తా రాజకీయంగా మారుతోంది.
రమణ దీక్షితులుకు నోటీసులు జారీ చేయడాన్ని కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ తప్పు పట్టారు. చిన్న విషయాన్ని సాకుగా చూపి దీక్షితులుకు నోటీసులు జారీ చేయడం సరి కాదని ఆయన అన్నారు. రమణ దీక్షితులును నోటీసులు ఇవ్వడం ద్వారా వేధింపులకు గురి చేయడం మంచిది కాదని అన్నారు.
రమణ దీక్షితులుకు టిటిడి క్షమాపణ చెప్పాలని కూడా చింతా మోహన్ డిమాండ్ చేశారు. అయితే, అన్ని తెలిసిన రమణ దీక్షితులు తప్పు చేయడం సరి కాదని, ఆగమ శాస్త్రాల గురించి తెలిసి ఆయన అలా చేయడమేమిటని అంటున్నారు.
ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తన మనవడిని స్వామివారి గర్భాలయంలోకి తీసుకెళ్లారనే అభియోగంపై ఆలయ డిప్యూటీ ఈవో కోదండ రామారావు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలు అతిక్రమించినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8న హనుమంత వాహనసేవ జరిగింది. ఆ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో మనవడిని వెంటపెట్టుకుని కులశేఖరపడిని దాటుకుని గర్భాలయంలోకి తీసుకెళ్లారు.