ఏపీ రాజకీయ పార్టీలకు నవంబర్ 1 టెన్షన్ ! సుప్రీంకోర్టు ఏం జరగబోతోంది ? తర్వాత జరిగేదిదే !
ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు నవంబర్ 1న టెన్షన్ కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం విషయంలో సుప్రీంకోర్టు నవంబర్ 1న కీలక విచారణ చేపట్టబోతోంది. ఈ విచారణలో ప్రభుత్వ వాదనకు సుప్రీంకోర్టు సై అంటుందా లేక రైతులకు సానుకూలమైన తీర్పువస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రాష్ట్రంలో మరిన్ని పరిణామాలకు దారితీసే అవకాశం ఉండటమే.

ఏపీ పార్టీల్లో నవంబర్ 1 టెన్షన్
ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్షంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఒక్కటే టెన్షన్. నవంబర్ 1న రాష్ట్రంలో రాజధానుల విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్, హైకోర్టు తీర్పు సరిగ్గా అమలు కావడం లేదంటూ రైతులు దాఖలు చేసిన మరో పిటిషన్ కలిపి సుప్రీంకోర్టు విచారించబోతోంది. ఈ విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు రాజకీయ పార్టీలపై కచ్చితంగా పెను ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

హైకోర్టు తీర్పును సమర్ధిస్తే..
ఒకవేళ నవంబర్ 1న జరిగే విచారణలో సుప్రీంకోర్టు .. గతంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తే ఏం జరగబోతోందో ముందు చూద్దాం. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్దిస్తే ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయడం ఇందులో ఒకటైతే.. రెండవది సుప్రీంకోర్టులోనే రాజ్యాంగ ధర్మాసనం విచారణ కోరడం. ఈ రెండింటిలో రెండో ఆప్షన్ నే ప్రభుత్వం ఎంచుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధిస్తే మూడు రాజధానులకు రాష్ట్రంలో మద్దతిస్తున్న వారు తాత్కాలికంగా అయినా పునరాలోచనలో పడే అవకాశాలుంటాయి.

హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టేస్తే ?
సీఆర్డీయే చట్టం ప్రకారం అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు విభేదిస్తే మాత్రం వైసీపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభిస్తుంది. తద్వారా రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రక్రియ ఊపందుకుంటుంది. ఎన్నికల్లోపే మూడు రాజధానుల్ని ఏర్పాటు చేసి పాలనను వికేంద్రీకరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్రం కూడా హైకోర్టు తరలింపు సహా వైసీపీ ప్రభుత్వం తీసుకునే మిగతా అన్ని నిర్ణయాలకు అండగా నిలవక తప్పదు. మరోవైపు ప్రభుత్వం తరహాలోనే అమరావతి రైతులతో పాటు విపక్ష పార్టీలు కూడా ఈ వ్యవహారం రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని కోరితే మాత్రం మరో విచారణ తప్పదు. అప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పు అంతిమం అవుతుంది.












Click it and Unblock the Notifications