గంటా శ్రీనివాసరావు ఇక టీడీపీలోనే: నారా లోకేష్తో సుదీర్ఘ భేటీ, వివరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గత కొంత కాలంగా పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతుండగా.. అందుకు చెక్ పెట్టే భేటీ జరిగింది. గంటా శ్రీనివాసరావు మంగళవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
లోకేష్ నివాసానికి గంటా శ్రీనివాసరావు, వివరణ
లోకేస్ నివాసానికి వచ్చిన గంటా శ్రీనివాసరావు.. దాదాపు 30 నిమిషాలకుపైగా భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత లోకేష్తో భేటీ కావడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో తాను పార్టీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది.. తదితర అంశాలను లోకేష్ కు గంటా వివరించినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేగా గెలిచినప్పట్నుంచీ టీడీపీకి దూరంగానే గంటా
2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి.. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి గెలుపొందారు గంటా శ్రీనివాసరావు. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడటం.. వైసీపీ అధికారంలోకి రావడంతో గంటా రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. టీడీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, గంటా వైఖరిపై అసంతృప్తితో ఉన్నప్పటికీ.. టీడీపీ కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానంతో తిరిగి దగ్గరయ్యేందుకు గంటా తన ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఇక టీడీపీలోనే గంటా శ్రీనివాసరావు
తాజాగా, రాష్ట్రంలో రాజకీయాలు మలుపులు తిరుగుతుండటంతో తిరిగి గంటా శ్రీనివాసరావు టీడీపీ అధిష్టానానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ గంటాను ఎప్పుడూ దూరం పెట్టకపోయినా.. ఆయనే తనకు తానుగా దూరమయ్యారు. అయితే, ఏ పార్టీలోనూ చేరనప్పటికీ.. గతంలో కొన్నిసార్లు ఆయన తీరు.. అధికార వైసీపీకి దగ్గరవుతున్నట్లు కనిపించింద. దీంతో ఆయన టీడీపీని వీడతారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలన్నింటికీ తెరదించుతూ నారా లోకేష్తో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక టీడీపీలోనే క్రియాశీలకంగా గంటా శ్రీనివాసరావు ఉంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పాదయాత్రను తలపెట్టిన నేపథ్యంలో గంటా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.