ఎన్టీఆర్ సంక్షేమానికి నిజమైన నిర్వచనం: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి!!
టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు.
నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక ప్రభంజనం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగు కళామతల్లి ఆశీర్వాదం పొందారని, సంక్షేమం అనే పదానికి ఆయన పేరు మారుపేరని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవంతో తలెత్తుకుని జీవిస్తున్నారు అంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరిని ఆమె కొనియాడారు.

అందుకే తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను గుండెల్లో పెట్టుకున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమం అనే పదానికి నిజమైన నిర్వచనం చెప్పింది ఎన్టీఆర్ అని పేర్కొన్న పురందేశ్వరి ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది పేదలకు రూపాయికి బియ్యాన్ని ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారని, తెలుగువారి ఆత్మగౌరవ ఒక ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోంది. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు.తెలుగుజాతి ఖ్యాతి మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానన్నారు.
కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు అని ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళులర్పించారు. ఉదయాన్నే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. వారితో పాటు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు












Click it and Unblock the Notifications