ఎన్టీఆర్ ఆంధ్రా నేత: కేసీఆర్, ఇంకా పెత్తనమా: జీవన్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంధ్రా నాయకుడి పేరు పెట్టడం సరికాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాసన సభలో అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రముఖులను గుర్తించవద్దా అని ప్రశ్నించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ఓ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు సభాపతికి వాయిదా తీర్మానం ఇచ్చారు.
శాసన సభ ప్రారంభమైన తర్వాత దీని పైన చర్చ సాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు. ఎన్టీఆర్ ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమయ్యారన్నారు. సీమాంధ్ర ఆధిపత్యాన్ని ఇంకా తెలంగాణ మీద కొనసాగించాలని చూస్తే ఊరుకోమన్నారు. ఆంధ్రా పెత్తనాన్ని మొదట్లోనే తుంచి వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇంకా ఆంధ్రా పెత్తనమా అన్నారు. అసెంబ్లీలో దీని పైన ఏకగ్రీవం చేసి కేంద్రానికి పంపించాలన్నారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. తమను కేంద్రం గుర్తించవద్దా అన్నారు. విమానాశ్రయానికి పేరు పెట్టాలనుకుంటే తెలంగాణకు చెందిన కోమరం భీమ్, రావి నారాయణ రెడ్డి, షేక్ బందగీ, పీవీ నర్సింహా రావు తదితరులు ఉన్నారన్నారు. ఆంధ్రా నాయకుడి పేరు పెట్టడం సరికాదన్నారు.
రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం గుర్తించాలన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, భాష పైన తీవ్రమైన దాడి జరిగిందన్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో ఓ రాయి వేసినట్లుగా ఉందన్నారు. ఇప్పుడిప్పుడే స్వయం పాలన జరుగుతోందన్నారు.
కమ్యూనిస్టులూ తమ పిడి వాదనను విడిచి పెడుతున్నారన్నారు. వారు కూడా గతంలో ఉన్న విశాలాంధ్ర పత్రికను ఇప్పుడు మన తెలంగాణ పేరుతో పత్రికను తీసుకు వస్తున్నారన్నారు. రాజీవ్ గాంధీ టెర్నినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం పైన అందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
సభ్యుల ఆందోళనలో అర్థముందన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు ఎలా పెడతారన్నారు. దీని పైన సభ్యులం అందరం మాట్లాడుతామని, సభను ఐదు నిమిషాలు వాయిదా వేయాలని సభాపతిని సీఎం కోరారు. దీంతో సభాపతి సభను పది నిమిషాలు వాయిదా వేశారు.