కొత్తగా 35వేల బోర్వెల్స్ తవ్వాలనేదే లక్ష్యం...మంత్రి లోకేశ్ వెల్లడి
అమరావతి: రాష్ట్రంలో పేద రైతుల పొలాలకు సాగు నీరివ్వడమే లక్ష్యంగా ఎపి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకం ఎన్టీఆర్ జలసిరి. ఈ పథకం అమలుకు సంబంధించి తొలిదశలో 50 వేల బోర్స్ తవ్వకం టార్గెట్ గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పథకం ఎన్టీఆర్ జలసిరి-2లో భాగంగా మరో 35వేల బోర్వెల్స్ తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి లోకేశ్ తెలిపారు.
ఎన్టీఆర్ జలసిరి-2పై పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ జలసిరి-2 విధివిధానాలు, నూతన లక్ష్యాలు, నిధుల కేటాయింపు తదిదర అంశాలన్నీ మంత్రి లోకేష్ ఈ సమావేశంలో సమీక్షించారు.

ఎన్టీఆర్ జలసిరి-2లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 35వేల బోర్వెల్స్ తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. లక్ష్యాన్ని అధిగమించేందుకు గాను భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో బోర్లకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. పంపు సెట్లను ఏర్పాటు చేసేందుకు గాను ఇప్పటికే రూ.44కోట్ల నిధులు విడుదల చేశామని లోకేష్ తెలిపారు. అదనంగా జలసిరి-2 కార్యక్రమానికి రూ.116 కోట్లు కేటాయించామని మంత్రి లోకేష్ చెప్పారు. పంచాయితీ రాజ్ శాఖ అధికారులు విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఐదు ఎకరాల్లోపు రైతులందరికీ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం, మంజూరు పొందే ప్రక్రియను రైతులకు అనుగుణంగా సరళతరం చేసిన విషయాన్ని లోకేష్ గుర్తుచేశారు. కలెక్టర్ చైర్పర్సన్ గా ఉన్న జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులను గుర్తించి బోర్ వెల్స్ మంజూరుచేస్తుంది.












Click it and Unblock the Notifications