జగన్ రాగానే తొలి అరెస్ట్ ఎవరిదో చెప్పేసిన లక్ష్మీపార్వతి..!
ఏపీలో ఎన్టీఆర్ రెండో భార్యగా రాజకీయాల్లో ప్రవేశించి ఆ తర్వాత ఆయన కుటుంబంతో విభేదించి, ఆయన మరణం తర్వాత వైఎస్సార్సీపీలో చేరిపోయిన నందమూరి లక్ష్మీపార్వతి ప్రస్తుతం అధికార ప్రతినిధి హోదాలో కొనసాగుతున్నారు. తనపై విద్వేషం ప్రదర్శించినా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని పల్లెత్తుమాట అనని లక్ష్మీపార్వతి.. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో మాత్రం ఏమాత్రం అవకాశం వచ్చినా రెచ్చిపోతుంటారు.
అలాగే తన బాస్ వైఎస్ జగన్ ను పొగడ్తల్లో ముంచెత్తేందుకు లక్ష్మీపార్వతి ఏమాత్రం వెనుకాడరు. అలాంటి లక్ష్మీపార్వతి ఇవాళ అనూహ్యంగా రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఈసారి జగన్ అధికారంలోకి రాగానే తొలి అరెస్టు ఎవరిని చేస్తారన్న చర్చను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే జగన్ తో పాటు తనకూ బద్ధశత్రువుగా ఉన్న సీఎం చంద్రబాబును కాకుండా ఆయన కుమారుడు, రెడ్ బుక్ రూపకర్త అయిన మంత్రి నారా లోకేష్ ను తొలి అరెస్టు చేస్తారంటూ లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు.

లోకేష్ రెడ్ బుక్ పాలన ఆయన మెడకే చుట్టుకుంటుందని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనపై తాను ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అందులో ఇలాంటి వారిని (లోకేష్) ప్రోత్సహించవద్దని, హంతకులను వెనకేసుకు రావొద్దని కోరతానన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వారు మీరు స్నేహితులా అంటూ ప్రదాని మోడీని ప్రశ్నిస్తానన్నారు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు చంపేసిన వారు ఇప్పుడు ఆయన విగ్రహం పెడతామంటూ డైవర్షన్ రాజకీయం మొదలుపెట్టారని, చంద్రబాబుకు చేతనమైతే ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications