అధినేతకు విధేయుడు: టీడీపీ 'ఆకర్ష్', ఆ ఒక్కడి కోసం బాబు ఎదురుచూపు..!
అమరావతి: ఏపీలో అధికార పక్షమైన టీడీపీ సమర్ధవంతమైన నాయకత్వం లేని నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు వలసలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' ను చేపట్టింది. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు.
మరో ముగ్గురు టీడీపీలో చేరేందుకు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ వైసీపీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు.
ఇదే మార్గంలో వైసీపీకి చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తాను టీడీపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.
అయితే ఆ ఎమ్మెల్యే అలా చెప్పడం వెనుక ఆర్ధిక బంధం ఉన్నట్లు సమాచారం. వైసీపీ నుంచి గెలుపొందిన ఆ ఎమ్మెల్యే అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ బడా కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకుని పూర్తి చేశారు. అది కూడా పొరుగు రాష్ట్రంలో.
జగన్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ఎమ్మెల్యేకు సుమారు 70 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్టులు ఇప్పించారు. అయితే కాంట్రాక్టులు పూర్తి అయినప్పటికీ, డబ్బులు ఇంకా రావాల్సి ఉంది. అంతేకాదు డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కారణం చేతనే ఆయన టీడీపీలోకి వెళ్లే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి టీడీపీలోకి వెళ్లాలనే కోరిక ఆయనకు బలంగా ఉన్నా, కార్యకర్తలు కూడా వెళ్లమంటున్నా ఈ ఆర్ధిక బంధం వెళ్లనీయడం లేదు. దీంతో తనని టీడీపీలోకి రమ్మని ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు.
దీంతో ఆ బడా కాంట్రాక్టర్ తమకు టచ్లోనే ఉన్నాడని, ఆ డబ్బులేవో తామే ఇప్పిస్తామని టీడీపీ నేతలు ఆ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారట. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పార్టీ మారే ప్రక్రియను ప్రారంభించారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నేతలకు తన మనోగతాన్ని చెప్పేశారు.
వాళ్లు కూడా అందుకు అంగీకరించారు. అయితే టీడీపీ నేతల నుంచి పూర్తిస్థాయి హామీని పొందిన తర్వాత మరోసారి తన నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నాడని సమాచారం. కృష్ణా జిల్లా నుంచి వైసీపీ పార్టీ తరుపున ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా వారిలో విజయవాడకు చెందిన జలీల్ ఖాన్ ఇప్పటికే టీడీపీలో చేరారు.
మరో ముగ్గురిలో గుడివాడకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు నూజివీడుకు చెందిన ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు కాగా పామర్రుకు చెందిన ఉప్పులేటి కల్పన ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజగ వర్గంలో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అవినీతి మరక లేని.. వివాద రహితుడు. ఈ ఎమ్మెల్యే వస్తే.. పార్టీకి ఓ నాయకత్వం దొరికినట్లవుతుందని టీడీపీ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది.