'పాత పార్టీకి కొత్త డ్రైవర్, చంద్రబాబు దౌర్జన్యాలపై ఈ 'సత్తా' ఏం చేసింది'
విజయవాడ: సాగునీటి ప్రాజెక్టుల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రేమ లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు సోమవారం అన్నారు. గోదావరి - పెన్నా అనుసంధానం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. లోక్సత్తా లోపలి రంగు పసుపు అన్నారు.
ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు ఇలాంటివి గుర్తుకు వస్తాయని చెప్పారు. రెండు మూడు నెలల్లో అనుసంధానం పూర్తి అవుతుందా అని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో ఎన్నికల ఆర్భాటం చేస్తున్నారని చంద్రబాబుపై అంబటి నిప్పులు చెరిగారు.
ఇప్పుడొస్తావా.. జగన్కు టిట్లీ దెబ్బ: శ్రీకాకుళం జిల్లాలోకి అడుగు, జడ్ ప్లస్ సెక్యూరిటీ
తెలంగాణలో చంద్రబాబు అలాగే చేశారు
పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు దోచారని అంబటి అన్నారు. ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో సాగునీరు విస్తీర్ణత తగ్గిందని చెప్పారు. 2003లో చంద్రబాబు తాత్కాలిక సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అప్పుడు ఆయన ఓ హెలికాప్టర్ వేసుకొని, అందులో సిమెంట్, ఇసుక, తాపీ మేస్త్రీని తీసుకెళ్లారని, అక్కడ శంకుస్థాపన చేసి వచ్చారన్నారు. అదే తంతులో భాగంగానే గోదావరి - పెన్నా అనుసంధానం అన్నారు.
పాత పార్టీకి కొత్త డ్రైవర్
పాత పార్టీ లోక్సత్తా పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త డ్రైవర్గా వచ్చారని అంబటి చెప్పారు. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ లోక్సత్తా అని ఎద్దేవా చేశారు. లోక్సత్తా జేపీ పార్టీకి జేడీ కారు డ్రైవర్గా కొత్తగా వచ్చారని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేస్తోందని చెప్పారు. పాతబండికి కొత్త డ్రైవర్ వచ్చారని చెప్పారు. బండి రంగు లోపల మొత్తం పసుపు (తెలుగుదేశం) అన్నారు. పైకి మాత్రం నీలం రంగు కనిపిస్తుందన్నారు.
సత్తా.. సత్తా అంటూ ప్రశ్నలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్తా (లోక్సత్తా) ఏమీ మాట్లాడదని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో లేనప్పుడు.. ఏ వైయస్ రాజశేఖర రెడ్డినో అధికారంలో ఉంటే మాత్రం ఈ సత్తా బయలుదేరి విరివిగా ప్రచారం చేస్తుందని చెప్పారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఈ సత్తా పార్టీ కాల్ మనీ సెక్స్ రాకెట్, పార్టీ ఫిరాయింపుల గురించి, దోపిడీ వ్యవస్థ గురించి, రాజ్యాంగాన్ని మంటకలుపుతున్న తీరు గురించి, ఎప్పుడూ మాట్లాడలేదన్నారు.
సిద్ధాంతాలు చెబుతున్నారు కానీ బాబు దౌర్జన్యాల మాటేమిటి
వారు సిద్ధాంతాలు బ్రహ్మాండంగా చెబుతారని, కానీ చంద్రబాబు దౌర్జన్యాలు, అక్రమాల గురించి మాట్లాడరేమని అంబటి అన్నారు. అలాంటప్పుడు ఈ సత్తా ఏమయిపోయిందని లోక్సత్తాను ఉద్దేశించి ప్రశ్నించారు. గత ఎన్నికల్లోను ఓట్లు చీల్చేందుకు చాలామందిని వదిలారని, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారన్నారు. చంద్రబాబు కోసం పుట్టిన కవలపిల్లల్లో ఒకటి లోక్సత్తా అన్నారు.