విజయ సాయిరెడ్డికి అంత పవరుందా ? సీఎం రమేష్ కంపెనీలపై విచారణకు ఆదేశించిన కేంద్రం..!
వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి టిడిపి నేతలను వీడటం లేదు. ఎన్నికల వేళ వరుసగా టిడిపి లక్ష్యంగా ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేసిన సాయిరెడ్డి..ఇక, టిడిపి నేతలను ఇప్పటికీ వదలటం లేదు. కొంత కాలం క్రితం సీయం రమేష్..విజయ సాయిరెడ్డి మధ్య మాటల యుద్దం సాగింది. ఆ సమయంలో సాయిరెడ్డి కేంద్రానికి సీయం రమేష్ కంపెనీల పైన ఫిర్యాదులు చేసారు. దీని పైన కేంద్రం స్పందించి విచారణకు ఆదేశించింది.
సాయిరెడ్డి వర్సెస్ సీఎం రమేష్
ఇద్దరూ రాజ్యసభ సభ్యులే. ఒకరు టిడిపి నుండి..మరొకరు వైసిపి నుండి ఎంపీలుగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వర్సెస్ టిడిపి ఎంపి సీయం రమేష్ అన్నట్లుగా వ్యవహారం సాగింది. ఆ సమయంలోనే సీయం రమేష్ను సారా వ్యాపారి అంటూ సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం రమేష్ సైతం తీవ్రంగానే స్పందించారు. ఇక, ఎన్నికల వేళ సాయిరెడ్డి టిడిపితో పాటుగా ఆపార్టీకి మద్దతుగా నిలుస్తున్నారనంటూ పలువురి పైన ఫిర్యాదులు చేసారు. ఫలితంగా ఎన్నికల సంఘం వారి పైన చర్యలు తీసుకుంది. దీనిని టిడిపి నేతలు తప్పు బట్టారు. ఇక, సీఎం రమేష్ కంపెనీల పైనా సాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు. ఆయనకు చెందిన కంపెనీల్లో అవినీతి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి కొంత మంది టిడిపి నేతల మీద ఆయన ఫిర్యాదులు చేస్తున్నారు.

రిత్విక్ కంపెనీల పైన విచారణ..
విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు పైన కేంద్రం స్పందించింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్లో నిర్మించిన కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్లో భారీ అవినీతి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి లేఖను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కోటేశ్వర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పూర్తి స్థాయి విచారణ చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం స్పందించి చర్యలు తీసుకున్న సమయంలో టిడిపి నేతలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఇక, ఇప్పుడు నేరుగా పార్టీ రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్ సంస్థల పైన సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించటం పైన రమేష్తో పాటుగా పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications