జగన్ నినాదాన్నే నమ్ముకున్న పవన్ - టీడీపీ ఊసే లేదు, దిగిపోతాం..!!
జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా ప్రచారం ప్రారంభించారు. వారాహి యాత్ర మొదలు పెట్టిన పవన్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ నమ్ముకున్న నినాదాన్నే ఇప్పుడు పవన్ ఎంచుకున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. పదేళ్ల పాటు అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. పనితీరు బాగాలేదంటే రాజీనామా చేసి దిగిపోతామని చెప్పుకొచ్చారు. ఎక్కడా టీడీపీ ప్రస్తావన చేయలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
పవన్ ఒక్క ఛాన్స్ ప్లీజ్:
వారాహి యాత్ర ప్రారంభంతో పవన్ కల్యాణ్ ఆసక్తి కర రాజకీయం మొదలు పెట్టారు. గత సభలు..సమావేశాల్లో పలు మార్లు పొత్తులు..పార్టీల గురించి చెప్పుకొచ్చిన పవన్ ఇప్పుడు ఎక్కడా వాటి ప్రస్తావన చేయటం లేదు. ఇదే సమయంలో కొత్త నినాదం వినిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ తన పాదయాత్ర సమయంలో ఒక్క ఛాన్స్ ఇవ్వాలని నాడు ప్రజలను కోరారు. 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

జగన్ నాటి ఆ నినాదం పైన పవన్ కల్యాణ్ తో సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసాయి. కానీ, ఇప్పుడు పవన్ తిరిగి అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రానికి అంకిత భావం ఉన్న నేతలు అవసరమని చెప్పుకొచ్చారు. దశాబ్ద కాలం అధికారం లేకపోయినా ప్రజల కోసం నిలబడ్డానని..ఈ సారి ఒక్క అవకాశం ఇవ్వాలని పవన్ కోరుతున్నారు.
పదేళ్ల పాటు జనసేనను నమ్మండి:
జనసేనను నమ్మాలని పవన్ అభ్యర్ధించారు. పదేళ్ల పాటు అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరుతూ..పనితీరు బాగాలేదంటే చెప్పండి.. రాజీనామా చేసి దిగిపోతామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. పవన్ కల్యాణ్ గత సమావేశాల్లో ఓపెన్ గా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో పొత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి పదవి పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. తాను సీఎం కావాలని కోరుకొనే వారు తనకు మద్దతుగా నిలిచారా అని ప్రశ్నించారు. సీఎం పదవి కోరాలంటే..ఇతర పార్టీలు మనకు ఎందుకు ఇస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిపించాలని..అప్పుడు ముఖ్యమంత్రి సీటు గురించి మాట్లాడుదామంటూ ప్రతిపాదించారు.
పవన్ కొత్త రాజకీయం వెనుక:
ఇప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఎక్కడా పొత్తుల ప్రస్తావన చేయటం లేదు. టీడీపీ, బీజేపీ ఊసెత్తటం లేదు. తాను కలిపి వస్తానో...ఒంటరిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదంటూ కొత్త అంచనాలకు కారణమయ్యారు. అటు బీజేపీ అగ్రనేతలు వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోణలతో ఇప్పుడు అధికార పార్టీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. దీని పైనా పవన్ ఇప్పటి వరకు స్పందించలేదేు.
ఈ సమయంలోనే జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ పవన్ చేసిన వినతుల వెనుక పరమార్ధం ఏంటనే ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. పొత్తుల రాజకీయంలో మారుతున్న పరిణామాల తో టీడీపీ..జనసేన శ్రేణుల్లో డైలమా కొనసాగుతుంది. దీని పైన పవన్ ఈ తొలి విడత వారాహి యాత్ర ముగిసే లోగా క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications