బన్నీ-మహేశ్ మూవీల టాక్స్ కట్టలేదా ..!!? రెండు బ్లాక్ బస్టర్లు రూ 170 కోట్ల వసూళ్లు- పన్ను ఏదీ..ఏపీ మంత్రి..!!
ప్రస్తుతం ఏపీలో ఆన్ లైన్ మూవీ టిక్కెట్ల వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే, ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం పైన తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆన్ లైన్ టిక్కెట్ల ఆలోచన వెనుక గతంలో జరిగిన పరిణామాలను మంత్రి పేర్ని నాని వివరించారు. గత ప్రభుత్వ హాయంలోనే నాటి రెవిన్యూ..వాణిజ్య పన్నుల అధికారులు ఆన్ లైన్ టిక్కెట్ల విధానానికి మద్దతు గా ప్రభుత్వానికి లేఖలు రాసారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రతిపాదన పైన రాష్ట్రాలకు లేఖ రాసిందని మంత్రి చెప్పారు.
బ్లాక్ మార్కెటింగ్.. పన్ను ఎగవేతకు చెక్..
అదే సమయంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గతంలో లేఖ రాసిన సమయంలో ఆన్ లైన్ టిక్కెట్ల ద్వారా బ్లాక్ మార్కెంటింగ్ తో పాటుగా పన్ను ఎగవేత జరగకుండా అడ్డుకోవచ్చని సూచించారని మంత్రి గుర్తు చేసారు. ఇక, టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి..నాగార్జున.. దిల్ రాజు తో పాటుగా మరి కొంత మంది ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సమయంలో ఈ ఆన్ లైన్ టిక్కెట్ల విధానం పైన ప్రతిపాదన చేసారని వివరించారు. వారి చేసిన ప్రతిపాదనలను పరిశీలించే క్రమంలో భాగంగా ఈ ఆన్ లైన్ టిక్కెట్ల విధానం పైన కమిటీ ఏర్పాటు చేసామని మంత్రి చెప్పారు.
2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ల పై..కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం నుంచి దీని పైన తుది నిర్ణయం జరగలేదని వివరించారు. దీనికి కొనసాగింపుగా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమయ్యాయి. 2020 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయని గుర్తు చేసిన మంత్రి నాని.. ఆ రెండు బ్లాక్ బస్టర్లు అంటున్నారని అన్నారు. ఒక్క ఏపీ లెక్క చూస్తేనే..ఒకటి రూ 87 కోట్లు..మరొకటి రూ 83 కోట్లు పైనే వసూలు చేసాయని చెబుతున్నారని వివరించారు. ఈ రెండు సినిమాలకే సగటున రూ 25 కోట్ల పైన జీఎస్టీ రావాలని చెప్పారు.
ఆ రెండు సినిమాల గురించేనా.. పరోక్షంగా చెప్పారా
అయితే, ఆ ఏడాది అంతా వచ్చింది రూ 40 కోట్లుగా మంత్రి వెల్లడించారు. అంటే ఎక్కడో తేడా కొడుతుందిగా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి ఎక్కడా అవి ఏ సినిమాలు..ఎవరి సినిమాలు అనేది ప్రస్తావన తీసుకు రాలేదు. 2020 సంక్రాంతి సమయంలో వచ్చిన సినిమాలు..అందునా బ్లాక్ బస్టర్లుగా చెప్పటం ద్వారా ఆ పేర్లను పరోక్షంగా చెప్పినట్లుగా చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది. 2020 సంక్రాంతి సమయంలో విడుదల అయి..బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలుగా అలా వైకుంఠ పురం...సరిలేరు నీకెవ్వరూ మూవీలుగా పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
రెండు సినిమాలకు భారీ వసూళ్లు..
ఆ రెండు సినిమాలు వసూళ్ల పరంగానూ సక్సెస్ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠ పురం సినిమా అనేక రికార్డులు సాధించింది. పలు చోట్ల బాహుబలి రికార్డులు కూడా తిరగరాసిన చిత్రంగా పేరు సాధించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రానికి అల్లు అరవింద్...రాధాక్రిష్ణ నిర్మాతలుగా వ్యవహరించారు. అదే విధంగా.. మహేష్ బాబు హీరోగా వచ్చిన మూవీ సరిలేరు నీకెవ్వరూ. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీకి దిల్ రాజు..మహేష్ బాబు..అనిల్ సుంకర నిర్మాతలుగా ఉన్నారు.
మంత్రి చెప్పినా...సినీ సర్కిల్స్ లో
ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మంత్రి పేర్లు ప్రస్తావించకపోయినా.. అవి ఏ సినిమాలు అనేవి ఓపెన్ గా చెప్పకపోయినా..మంత్రి చెప్పిన రిలీజ్ డేట్ ఆధారంగా ఈ రెండు మూవీలే అని సినీ సర్కిల్స్ లో నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆ రెండు సినిమాలకు ఎంత వసూళ్లు జరిగింది..ఎంత మేర పన్నులు కట్టారనేది మూవీ మేకర్స్ మాత్రమే స్పష్టత ఇవ్వగలరు. ఆ మూవీ పేర్లు ప్రస్తావించకూడదే ఉద్దేశంతోనే మంత్రి ఓపెన్ గా చెప్పలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ఈ రెండు సినిమాల నిర్మాతలు మూవీ బిజినెస్ లో ఎంతో కాలంగా ఉండటంతో..పన్నుల విషయంలో అలా జరిగే అవకాశం ఉండదనే చర్చ మరో వైపు వినిపిస్తోంది.
Recommended Video
చిరంజీవి టీం భేటీ సమయంలో క్లారిటీ..
ఆ సమయంలో ఈ ఆన్ లైన్ టిక్కెట్ల విధానం పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సినీ పెద్దల అభ్యర్ధన మేరకే ఈ నిర్ణయం పైన ముందుకు కదిలామని చెబుతున్న ప్రభుత్వం..తిరిగి అదే పెద్దలు ఈ నిర్ణయం పైన ప్రభుత్వానికి ఎటువంటి అభ్యర్ధనలు సమర్పిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. దీని ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి చిరంజీవి అండ్ టీం సీఎం జగన్ తో సమావేశం ద్వారా ముగింపు లభిస్తుందని సినీ వర్గాల అంచనా.