ఏపీకి ఒకటే రాజధాని, అది అమరావతి: చివరి వరకూ రైతులతోనేనంటూ బీజేపీ నేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. కాగా, అమరావతి రైతుల మహా పాదయాత్ర 21వ రోజు నెల్లూరు జిల్లాలోని రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైంది.
రైతుల పాదయాత్రకు మద్దతుగా బీజేపీ నేతలు
ఆదివారం నాడు నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ నేతలు మద్దతు పలుకుతూ వారితో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక యువత పాదయాత్ర చేస్తున్న రైతులపై పూలవర్షం కురిపించారు. పరిసర గ్రామాల నుంచి ప్రజలు ట్రాక్టర్లు, ఆటోల్లో తరలివచ్చి రైతుల పాదయాత్రకు సంఘాభావం తెలిపారు.
ఏపీకి రాజధాని అమరావతి ఒక్కటేనంటూ సోము వీర్రాజు
ఈ సందర్భంగా కావలి వద్ద బీజేపీ, అమరావతి రైతులు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజా రాజధాని అమరావతిలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కడుతున్నామని చెప్పారు. కేంద్ర నిధులతో అమరావతిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రైతుల పాదయాత్రలో చివరి వరకు బీజేపీ పాల్గొంటుందని... అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Recommended Video
అమరావతికే కట్టుబడ్డాం, అసెంబ్లీలో దిగజారిన భాష: పురందేశ్వరి
కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ.. రాజధానిపై బీజేపీది మొదట్నుంచి ఓకే విధానమని స్పష్టం చేశారు. పాదయాత్రలో లాఠీఛార్జీలు చూసి బీజేపీ చలించిందన్నారు. అమరావతికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతపురం-అమరావతి రోడ్డు, ఎయిమ్స్ పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. రైతులను పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని విమర్శించారు పురందేశ్వరి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్నారు. విభజన చట్డంలోని అంశాల్లోని అన్ని అంశాలను 90 శాతం కేంద్రం పూర్తి చేసిందని పురందేశ్వరి గుర్తు చేశారు. ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ఎపీకి అనేక విధాలుగా సహకరిస్తుందన్నారు. ఎపీ ఆర్ధికస్ధితి సరిగాలేకపోతే నిధులను కేంద్రం ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఎపీలో అభివృద్ది జరుగుతుంది అంటే అది కేంద్రం నిధులేనన్నారు పురందేశ్వరి. అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని గతంలోనే ప్రకటించాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొంటున్నామన్నారు. రైతులపై దాడులు సరికాదన్న పురంధేశ్వరి.. రాజధాని అభివృద్ది కోసం కేంద్రం రూ.1,500 కోట్లు కేటాయించిందన్నారు పురందేశ్వరి. అసెంబ్లీ అన్నది చట్టాలు చేసుకొనే పవిత్రమైన ప్రదేశం.. భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారని పురంధేశ్వరి మండిపడ్డారు. సభలో భిన్నమైన వాతావరణం జరుగుతుంది. ప్రజా సమస్యలపై కాకుండా ఇతర అంశాలను ప్రస్తావిస్తూ.. అసెంబ్లీ వాతావరణాన్ని మార్చేస్తున్నారన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.