సింగపూర్లా ఏపీలో సింగిల్ పార్టీ: రావెల జోస్యం, జగన్ పిచ్చోడిలా: పత్తిపాటి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ స్థితిగతుల పైన ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో సింగిల్ పార్టీనే ఉండనుందన్నారు.
సింగపూర్ లో ప్రస్తుతం ఒకే పార్టీ విజయం సాధిస్తూ వస్తోందన్నారు. సింగపూర్ తరహాలోనే ఏపీలోను ఇక సింగిల్ పార్టీ ప్రభుత్వానిదే అధికారమని జోస్యం చెప్పారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ సీటు కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. సింగపూర్లాగే ఒకే పార్టీ విధానం రాబోతుందన్నారు.
నదుల అనుసంధానం చారిత్రాత్మక ఘట్టమని చెప్పారు. ఇది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైందని చెప్పారు.
వైసిపి అధ్యక్షులు జగన్ చేసేవి దొంగ దీక్షలన్నారు. వాటిని వైసిపి కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారన్నారు. రాజధాని భూముల విషయంలో వ్యతిరేకత వచ్చినా జగన్ తీరు మారలేదన్నారు. ఇప్పుడు బందరు పోర్టు ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు.
జగన్ పిచ్చోడిలా తిరగాల్సిందే: పత్తిపాటి
అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్ పిచ్చోడిలా తిరిగే రోజు దగ్గరలో ఉందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీకి ప్రపంచ బ్యాంకు రెండోస్థానం ఇచ్చి గౌరవిస్తే జగన్ ప్రతిదానిపై బురద జల్లుతున్నారన్నారు. జగన్ తీరు మార్చుకోకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.
తిరుపతిని హెల్త్ హబ్గా చేస్తాం: చంద్రబాబు
తిరుపతిని హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శేషాచలం అడవుల్లో పచ్చదనాన్ని పెంచడానికి చర్యలు చేపడతామన్నారు.