కల్యాణం .. కమణీయం : వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం, పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
కడప : రాములోరి కల్యాణం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కన్నులపండువగా జరిగింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణల మధ్య కోదండరాముడు .. సీతమ్మ వారి మెడలో తాళికట్టారు. అక్కడున్న భక్తజనం సీతారాముల కల్యాణం చూసి తరించిపోయారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం గురువారం రాత్రి 8 గంటలకు ఆశేష భక్తజన సందోహం మధ్య జరిగింది.
సతీసమేతంగా ..
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి సీఎం చంద్రబాబు సతీసమేతంగా వచ్చారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో .. కల్యాణ క్రతువు ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ దంపతులు కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నవమితో అంకురార్పణ ..
ఈ నెల 13 శ్రీరామ నవమితో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల క్రతువు .. ఈ నెల 22న జరిగే పుష్పయాగంతో ముగుస్తాయి. ఒంటిమిట్ట రామాలయంలో కళ్యాణం పౌర్జమి రోజున జరిగే ఆనవాయితీ కొనసాగుతోంది. రోజుకో వాహన సేవలో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు.
ఏకశిలపై సీతారాములు ..
ఆంధ్రా అయోధ్యగా పిలిచే ఏకశిలానగరం కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఘన చరిత్ర ఉంది. ఏకశిలపై చెక్కిన సీతారాములు, లక్ష్యణ విగ్రహాలు ఉన్నాయి. దీంతోపాటు శ్రీరాముని భక్తుడు హనుమంతుడు లేని రామాలయం ఇదోక్కటే కావడం మరో విశిష్టత నెలకొంది.
రాష్ట్రస్థాయి వేడుకగా కల్యాణం ..
ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణం ముఖ్యమైంది, రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి నిర్వహిస్తోంది. ఏపీలో ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం వేచిచూస్తున్న తరుణంలో .. కోదండరాముడి కృప కోసం నాయకులు బారులుతీరి .. దర్శించుకుంటున్నారు.