మేనమామ గా సీఎం జగన్ బాధ్యతతో : 44 లక్షల కుటుంబాల్లో "అమ్మఒడి" - రూ 19,618 కోట్ల పంపిణీ..!!
ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక అమ్మఒడి పథకం. విమర్శించే వారు సైం ప్రశంసించే వినూత్న కార్యక్రమం. నాడు 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన నవరత్నాల్లో అమ్మలకు తోడుగా.. చిన్నారులకు మేనమామగా అందించిన వరం. తరాన్ని..తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందంటూ బడికి వెళ్లే విద్యార్ధులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన పథకం. బాధ్యత గల ప్రభుత్వంగా చదువు మీద పెట్టే ప్రతీ పైసాను పవిత్ర పెట్టుబడిగా భావిస్తామంటూ సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీం. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా వ్యవస్థ.. విద్యార్ధులను ప్రోత్సహించే కార్యక్రమాలకు.. ప్రభుత్వ పాఠశాలలపైన ఫోకస్ పెరిగింది. వీటి ఫలితమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్ధుల సంఖ్య పెరిగింది.

తరాన్ని -తల రాతను మార్చాలంటూ
కార్పోరేట్ విద్యా సంస్థల తరహాలో యూనిఫాం నుంచి బూట్లు..బ్యాగ్ లు..అన్నీ ప్రభుత్వమే అందిస్తోంది. పాఠశాలల రూపు రేఖలు మారుస్తోంది. విద్యా బోధన..విద్యా విధానంలోనూ మార్పులు తెచ్చింది. ఇక, ఏ పేద విద్యార్ధి బడికి వెళ్లకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే అమ్మఒడి. దీని ద్వారా మూడేళ్లు ఈ పథకం కింద రూ 19,618 కోట్లు అందించారు. మూడో విడతలో భాగంగా ఈ పథకం కింద లబ్ధి పొందే విద్యార్థులు 82,31,502 కి చేరగా.. 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో తాజాగా రూ 6,595 కోట్లు జమ చేసారు. ఈ పథకం అమల్లో భాగంగా.. ముందుగానే ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా.. పాఠశాలల్లో డ్రాపౌట్స్ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకానికి కనీసం 75 శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. 2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడు జీవోలోనే ఆ నిబంధనలు ఉన్నాయి. అయితే పథకం ప్రారంభించిన తొలిఏడాది కావడంతో 2019 -20లో, కోవిడ్ కారణంగా 2020 -21లో కనీసం 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు కల్పించింది.

44 లక్షల కుటుంబాలకు లబ్ది
గత ఏడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో విద్యాసంస్ధలు యధావిధిగా పని చేస్తున్నందున 75 శాతం హాజరు నిబంధన చివరగా అందించిన సాయం వేళ అమలు చేసింది. దీనివల్ల 2021-22లో 51,000 మంది అమ్మ ఒడి అందుకోలేకపోయారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా విద్యార్దులు బడికి హాజరవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొచ్చామని..75 శాతం హాజరు తప్పని సరి చేసామని సీఎం చెప్పుకొచ్చారు. ఈ విషయం బాధాకరమైనప్పటికీ భవిష్యత్లో ఇలాంటి పరిస్ధితి తలెత్తకుండా పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఇక..అమ్మ ఒడి నిధుల్లోనే మన బడి నాడు నేడు ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు చిరకాలం విద్యార్ధులకు అందాలన్న తపనతో, చిన్న చిన్న మరమ్మతులను తక్షణమే చేపట్టే లక్ష్యంతో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్)కోసం రూ.వెయ్యి చొప్పున జమ చేస్తున్నారు.

83 లక్షల మంది విద్యార్దులు బడికి
అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కు కూడా రూ.వెయ్యి చొప్పున జమ చేస్తారు. అమ్మ ఒడి ద్వారా 2019 -20లో రాష్ట్ర ప్రభుత్వం 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్లు అందించింది. 2020- 21లో 44,48,865 మందికి రూ.6,673 కోట్లకుపై సాయంగా ఖాతాల్లో జమ చేసింది. దీంతో..ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం రూ 19,618 కోట్లకు చేరింది. ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మ ఒడి, మనబడి నాడు-నేడు, విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, సీబీఎస్ఈ విధానం, బైజూస్తో ఒప్పందం తదితరాలతో విద్యార్థులకు పూర్తి ప్రయోజనం చేకూరి ప్రపంచంతో పోటీ పడగలిగే పరిస్ధితి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ పధకం అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వం అందిస్తోంది. దీనికి మేధావులతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications