ఆరోగ్య ప్రదేశ్ లక్ష్యంగా - సీఎం జగన్ కీలక నిర్ణయాలు : క్యాన్సర్ చికిత్స కోసం..!!
ఆరోగ్య శ్రీ. నాడు వైఎస్సార్ ప్రారంభించిన ఈ ఆరోగ్య శ్రీ పేద ప్రజలకు సంజీవనిగా నిలిచింది. ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయాలతో మరింతగా విస్తరించి.. పేదల ప్రాణాలకు భరోసా ఇస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరోగ్య శ్రీలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సాలీనా అయిదు లక్షల లోపు ఆదాయం ఉన్న అందరికీ ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు - పెన్షనర్లుకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఏపీలో అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాయి.
ఆరోగ్య శ్రీ అమల్లో సంస్కరణలు
రాష్ట్రంలో ఆస్పత్రుల్లోనే ప్రసవం జరిగేందుకు ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్ జరిగినా రూ.5వేలు ఇస్తారు. గతంలో సిజేరియన్ జరిగితే రూ.3వేలే, దీన్ని రూ.5వేలకు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహజ ప్రసవంపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదేనని సీఎం స్పష్టం చేసారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీలో 2446 ప్రొసీజర్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మరింతగా ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం నెలకు ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీనికి అనుబంధంగా 104,108 సేవల కోసం నెలకు రూ 25 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత
ఆరోగ్యశ్రీ, కింద మొత్తంగా ఏడాదికి జగన్ ప్రభుత్వం రూ నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రానికి రూ 225 కోట్ల వరకు అందుతున్నాయి. ఆరోగ్య శ్రీలో క్యాన్సర్ కేర్ పై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ పై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ గుర్తింపుపై దృష్టిపెట్టాలని అధికారులకు ఇప్పటికే స్పష్టం చేసారు. ఆరోగ్య శ్రీ పథకం మరింత పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా.. నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి ఖర్చు అయిన మొత్తం జమ చేయటం..అక్కడ నుంచి నేరుగా ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లింపు అయ్యేలా కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. దీనికి సంబంధించి ఆరోగ్య మిత్ర రోగితో పాటుగా బ్యాంకు - ఆస్పత్రి మధ్య ఒప్పందం కోసం ఒక అంగీకార పత్రం పూర్తి చేసి..అది అమలు చేస్తారు.
ఉద్యోగులకు మరింత వెసులుబాటు
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్ కాలేజీల్లో 2023 నుంచి మెడికల్ ప్రవేశాలకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక, ఉద్యోగులకు వైద్య సేవలకు సంబంధించి తాజాగా సీఎం ఆదేశాలతో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఈహెచ్ఎస్ కార్డు ద్వారా.. ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందేందుకు అనుమతి లభించింది. ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం జాబితాలో ఇప్పటివరకు లేని 565 వైద్య సేవలను కొత్తగా చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం పొందిన వారికి బిల్లులను.. ఆరోగ్య శ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటోడెబిట్ స్కీమ్ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం ఆమోద మద్ర వేసింది. దీంతో పెన్షనర్లు.. వారి కుటుంబ సభ్యులూ ఈహెచ్ఎస్ కార్డుపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందనున్నారు.