జగనన్న కాలనీలు : కోటి 24 లక్షల మందికి మేలు : పూర్తయితే ..ఇక తిరుగే లేదు..!!
ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రికలుగా మారాయి జగనన్న కాలనీలు. రాష్ట్ర వ్యాప్తంగా వీటిని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక భారీ సంక్షేమ కార్యక్రమం. కరోనా సంక్షోభంలోనూ వెనుకాడకుండా..కాలనీల పూర్తికి శంకుస్థాపనలు చేసారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక్కో ఇంటికి రూ 5 లక్షల నుంచి రూ 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం లక్షా 30 వేల కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద అర్హులుగా గుర్తించారు.

ముఖ్యమంత్రి మానస పుత్రిక
15.60 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 4.95 కోట్ల మంది ప్రజల్లో దాదాపుగా 1.24 కోట్ల మందికి సొంతిటిలో ఉండే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రతీ జిల్లాలో జేసీని నియమించారు. ఇళ్ల పట్టాలు అందించే సమయంలో ప్రభుత్వం లబ్ది దారులకు మూడు ప్రత్యామ్నాయాలు ఇచ్చారు. అందులో తొలిగా ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారమే ప్రభుత్వం ఇంటి సామాగ్రి ఇచ్చి...నిర్మాణం చేసుకోవటానికి ఖర్చులు ఇవ్వటం. కాగా రెండో ప్రత్యామ్నాయం ప్రకారం నిర్మాణ సామాగ్రి లబ్దిదారులే తెచ్చుకొనే వెసులుబాటు కలిగించారు. వారే ఇంటిని నిర్మించుకోవటం ద్వారా ఆ ఖర్చు ప్రభుత్వం రీ యంబర్స్ చేస్తోంది. ఇక..మూడో ఆప్షన్ ప్రకారం ప్రభుత్వమే పూర్తిగా ఇల్లు కట్టి పూర్తి చేసి ఇవ్వటం.

లబ్ది దారులు మూడు ఆప్షన్లు
ఈ మూడు ఆప్షన్లలో లబ్దిదారులు ఏదైనా ఎంచుకొనే అవకాశం కల్పించింది. ఇక, కొత్తగా ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లల్లో గతం కంటే భిన్నంగా పూర్తి సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఉత్తమ జీవన ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా డిజైన్ చేసారు. 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. అందులో ఒక బెడ్రూం, లివింగ్ రూం, కిచెన్, టాయిలెట్, వరండా ఉంటాయి. ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బ్లు, సింటెక్స్ ట్యాంక్ లబ్ది దారులకు అందిస్తారు. జగనన్న కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు. జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాల్టీలే తయారవుతున్నాయి. ఇలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.

సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షణ
నిర్మాణ నాణ్యత విషయంలో ప్రత్యేకంగా శ్రద్ద పెడుతున్నారు. 30.76 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో పంపిణీ చేసి, రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలోనూ అంతే వేగంగా ముందుకు వెళుతోంది. ఇళ్ల స్థలాలు పొందిన వారికి రెండు దశల్లో మొత్తం 28,30,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతంలో టీడీపీ హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు కొనసాగిస్తోంది. అన్ని వసతులు ఉన్న పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల ప్లింత్ ఏరియా 215 చదరపు అడుగులు, కార్పెట్ ఏరియా 144 చదరపు అడుగులుగా ఉండేది.

పూర్తి చేస్తే..చిరస్థాయిగా సీఎం జగన్
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ రూరల్ ఇళ్ల ప్లింత్ ఏరియా 224 చ.అ, కార్పెట్ ఏరియా 180 చ.అవిస్తీర్ణం. ప్రస్తుతం ప్రభుత్వం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ల ప్లింత్ ఏరియా 340చ.అ, కార్పెట్ ఏరియా 218.65 చ.అ విస్తీర్ణం ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద పెద్ద ఊర్లే సిద్దం అవుతున్నాయి. సంతృప్త స్థాయిలో కులం, జాతి, మతంతో సంబంధం లేకుండా అర్హులందరికీ నివాస స్థల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించనుంది. మిషన్ మోడ్లో స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మించేందుకు విధివిధానాలు రూపొందించి అర్హులను ఎంపిక చేసింది. ఇప్పుడు ఈ పధకం పూర్తి చేసి లబ్డిదారులకు అందించటం ద్వారా.. కోట్లాది మంది గుండెల్లో జగన్ చిర స్థాయిగా నిలిచిపోతారని వైసీపీ నేతలే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications