అడ్వాంటేజ్ ఏపీ - విశాఖ కేంద్రంగా కీలక మలుపు..!?
విశాఖ సదస్సు ఏపీ భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మారనుంది. ప్రభుత్వం ఇప్పుుడు దీని పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. విశాఖ కేంద్రం రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. విశాఖ పరిపాలనా రాజధానిగా మంత్రులు పదే పదే చెప్పుకొస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమం గురించి ఎటువంటి విమర్శలకు అవకాశం లేదు. ప్రతిపక్షాలు నిత్యం అభివృద్ధి - పరిశ్రమలు - పెట్టుబడుల గురించి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. ఇక ఇటు ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో విశాఖ కేంద్రంగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కీలకం కానుంది. ఈ సదస్సులో నిర్ణయాలు..పెట్టుబడుల ఒప్పందాలు ప్రధానంగా భావిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఇదే వేదిక నుంచి సమాధానం చెప్పటానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. విశాఖలో ఈ సదస్సు రాజకీయంగానూ కీలక మలుపుగా భావిస్తున్నారు.

విశాఖ కేంద్రంగా సీఎం జగన్ కొత్త లెక్కలు
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పైన కట్టుబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో..కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నారు. తీర్పు ఆలస్యం అయితే విశాఖకు క్యాంపు కార్యాలయం షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి తాను త్వరలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు వెల్లడించారు. సంక్షేమంలో పూర్తి స్థాయిలో పాస్ అయ్యారు. సంక్షేమం అంశంలో ప్రతిపక్షాలే ఆత్మరక్షణలోకి వెళ్లాయి. జగన్ ను మించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పటం మినహా.. లోపాలను ప్రస్తావించటానికి అవకాశం చిక్కటం లేదు. ఇదే సమయంలో అభివృద్ధి - పెట్టుబడుల అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రం పారిశ్రామిక - పెట్టబడుల రంగంలో సాధించిన పురోగతిని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ సమయంలోనే విశాఖ కేంద్రగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కీలకంగా కనిపిస్తోంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి స్థానం
ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్ల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి స్థానంలో ఏపీ నిలిచింది. 11.43 శాతం వృద్ధి రేటుతో మిగలా రాష్ట్రాల కంటే మిన్నగా ఉంది. పెట్టుబడులు రాబట్టటంలో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. ఇటు సంక్షేమం కొనసాగిస్తూ...ఇటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యత ఇవ్వనుంది. చంద్రబాబు హయాంలో సగటున రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల వ్యవధిలోనే తాము సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. పెట్టుబడులు రాబట్టటంలో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. 38.5 శాతం ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లను అభివృద్ధి చేస్తున్నామని తాజాగా ఢిల్లీ కేంద్రంగా పారిశ్రామిక వేత్తల సమావేశంలోనూ సీఎం జగన్ చెప్పారు. మూడేళ్లలోనే 2.06 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీ వేదికగా జగన్ స్పష్టం చేసారు. చంద్రబాబు హయాంలో 34 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చెప్పుకొచ్చారు.

తరలి వస్తున్న జాతీయ - అంతర్జాతీయ ప్రముఖులు
విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొనేందుకు జాతీయ - అంతర్జాతీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోడ్ షోలు నిర్వహించింది. సీఎం జగన్ ఢిల్లీ కేంద్రంగా పలు దేశాల రాయబార్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ గ్లోబల్ సమ్మిట్లో, బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-గవర్నమెంట్ సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అడ్వాంటేజ్ ఆంధ్రా అనే పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. మెరైన్ ఉత్పత్తులు, ఆగ్రో ఫుడ్ ప్రోసెసింగ్, డిఫెన్స్ ఉత్పత్తులు ఈ సమ్మిట్ లో ప్రదర్శిస్తారని విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొంటారు. ప్రభుత్వం ఈ రెండు రోజుల సదస్సు ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.












Click it and Unblock the Notifications