ఎన్డీయే నుంచి ఎవరూ వెళ్లలేదు: బాబుకు అమిత్ షా ఝలక్, కేసీఆర్కు జైట్లీ దిమ్మతిరిగే కౌంటర్
న్యూఢిల్లీ/అమరావతి: ఎన్డీయేకు వచ్చిన నష్టమేమీ లేదని, కూటమిలో గతంలో కంటే ఎక్కువ పార్టీలు ఉన్నాయని, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, ఎన్డీయే నుంచి అందుకే బయటకు వెళ్లారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఎన్డీయే కూటమి నుంచి ఎవరూ బయటకు వెళ్లలేదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎన్డీయే నుంచి పలు పార్టీలు వైదొలిగాయన్న విమర్శలను తిప్పికొట్టారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత 11 పార్టీలు తమ కూటమిలో చేరాయన్నారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు మాత్రమే బయటకు వెళ్లారన్నారు. కానీ బీహార్ నుంచి నితీష్ వచ్చిందన్నారు.

దేశ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు తమకు సవాల్ విసరలేవని, తమ విజయం ఖాయమని అమిత్ షా అన్నారు. దేశ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, మోడీని వ్యతిరేకించే వారు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎల్లప్పుడూ గట్టిగా మాట్లాడుతున్నారని, దీనిని నేను కొత్తగా చూస్తున్నానని, మోడీ హటావో... మోడీని తొలగించాలన్నదే వాటి ఏకైక అజెండా అన్నారు. మోడీ మాత్రం అవినీతి, పేదరికాన్ని తొలగించాలని భావిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఏకమైనా ప్రధానిని ఏమీ చేయలేవని, ప్రజలంతా ఓ రాయి మాదిరిగా అండగా ఉన్నారన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్
తగిన సంఖ్యాబలం ఉంటే ప్రధాని పదవిని చేపడుతానంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. ఇందుకు కాంగ్రెస్లోనే మద్దతు లభించలేదని, ఇక ప్రతిపక్షాల మద్దతు ఎక్కడిదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లో 50 శాతం ఓట్లు సాధిస్తామన్నారు. ఎస్పీ, బీఎస్పీల పొత్తుపై మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు విజయం సాధిస్తాయని చెప్పారన్నారు. కానీ బీజేపీ భారీ విజయం సాధించిందన్నారు.

పెరుగుతున్న పెట్రో ధరలపై అమిత్ షా సమాధానం
తాము ఇచ్చిన హామీల అమలుకు ఇంకా ఏడాది సమయం ఉందని అమిత్ షా చెప్పారు. వారసత్వ పరిపాలనను అంతం చేసి, అభివృద్ధి రాజకీయాలకు నాంది పలికింది మోడీ అన్నారు. గత నాలుగేళ్లలో చాలా వరకు హామీలు అమలు చేశామని, ఇంకా ఏడాది సమయం ఉందన్నారు. నిర్ణయాలు తీసుకునే ముందు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరిగా మోడీకి ఎవరి అనుమతీ అవసరం లేదన్నారు. పెట్రోలు ధరలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ దీనిపై దీర్ఘకాలిక విదానం రూపొందిస్తామన్నారు.

కేసీఆర్ ఫ్రంట్పై జైట్లీ
రానున్న లోకసభ ఎన్నికల్లో మోడీ - అరాచక కూటమికి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆయన శనివారం ఫేస్బుక్లో స్పందించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనపై నా ఆలోచనలు పేరుతో అభిప్రాయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ విజయావకాశాలు తగ్గుతున్నాయని, ఆ పార్టీ ఓ ముఠాగా మిగిలిపోతోందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ విఫలయత్నమని జైట్లీ అన్నారు. (కేసీఆర్, మమతా బెనర్జీ తదితరులు ఫెడరల్ లేదా థర్డ్ కూటమికి ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.) ప్రాంతీయ పార్టీల నాయకులు తరచూ అభిప్రాయాలు మార్చుకుంటుంటారని, అందువల్ల ఇలాంటి ఫ్రంట్లు మనుగడ కొనసాగించలేవన్నారు.
ఇలాంటిదాన్ని అరాచక కూటమిగా అభివర్ణించారు. మోడీ ప్రభుత్వ అయిదో ఏడాది పాలనలో అన్ని పథకాల సమీకరణ జరుగుతుందన్నారు. గత ప్రధానిలా కాకుండా మోడీ పార్టీకి, జాతికి సహజసిద్ధమైన నాయకుడన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడం, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు అదుపులో ఉండడం తమ ప్రభుత్వ విజయాలన్నారు.












Click it and Unblock the Notifications