ప్రతిపక్షాలకు అవకాశాలు క్షీణిస్తున్నాయి - దురదృష్టకరం : సీజేఐ ఎన్వీ రమణ..!!
దురదృష్టవశాత్తు ప్రతిపక్షానికి అవకాశాలు క్షీణిస్తున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్రంగా చర్చలు, పరిశీలనలు లేకుండా బిల్లులు ఆమోదం పొందడాన్ని చూస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజస్థాన్ లో ఒక సెమినార్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. సమగ్రంగా చర్చలు, పరిశీలనలు లేకుండా బిల్లులు ఆమోదం పొందడాన్ని చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు అవకాశాలు తగ్గటం దురదృష్టకర పరిణామంగా అభివర్ణించారు. గతంలో ప్రభుత్వం, ప్రతిపక్షం పరస్పరం గౌరవించుకునేవని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నాయకులు కీలక పాత్ర పోషించేవారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య సహకారం ఒక ప్రగతిశీల ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను విరోధులుగా భావించరాదని సూచించారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులను చూస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని సీజేఐ స్పష్టం చేసారు.
ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయడం ద్వారానే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం అవుతుందని వివరించారు. ప్రజల అంచనాలు- ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయటంలో విఫలమైతే మార్పు రూపంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయని వివరించారు.
చురుకైన ప్రతిపక్షం పరిపాలనను మెరుగుపర్చడానికి, ప్రభుత్వ కార్యకలాపాలను సరిచేయడానికి సహకరిస్తుందన్నారు. ప్రతిపక్షాలకు స్పేస్ తగ్గుతోందని..లెజెండరీ చట్టసభ్యుల అడుగుజాడల్లో నడవాలన్నది తన కల అని చెప్పారు. కొంతసేపైనా సరే సభలోకి రావాలన్న తన కలను ఈ సెమినార్లో పాల్గొనాలని ఆహ్వానించటం ద్వారా నిజం చేశారని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్లే దేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతోందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశంలో అండర్ ట్రయల్స్ ఖైదీల సంఖ్య పెరుగుతుండటంపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జైళ్లను 'బ్లాక్ బాక్స్'లుగా అభివర్ణించారు. విచారణ ప్రక్రియే పెద్ద శిక్షని అన్నారు. ఏ విచారణ లేకుండానే సుదీర్ఘ కాలం జైలులో ఉన్న ఖైదీల సంఖ్యపై శ్రద్ధ పెట్టాలని సీజేఐ సూచించారు.