ఆ ఉత్తర్వులతో బాబుకు చిక్కులు: జగన్కు ప్లస్ అవుతాయా?
ఇటీవల విడుదలైన రెండు ప్రభుత్వ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తున్నాయి.
విజయవాడ: ఇటీవల విడుదలైన రెండు ప్రభుత్వ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తున్నాయి. అధికార వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఆ ఉత్తర్వులు వెలువడినట్లు ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు ఎక్కువగా అధికారులపై ఆధాపడడం వల్ల ఈ తప్పిదం జరిగినట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు కూడా తెలియకుండా నిర్ణయాలు తీసుకునే స్థితికి ఉన్నతాధికారులు చేరుకున్నారా అనే సందేహం కూడా కలుగుతోంది. గత వారం రోజుల్లో కీలక పరిణామాలకు సంబంధించిన రెండు ఉత్తర్వులు వెలువడ్డాయి.
కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని ఆర్ఐల నుంచి తహశీల్దార్లకు మారుస్తూ జారీ చేసిన ఉత్తర్వు ఒకటి కాగా, రెండ్రోజుల క్రితం ఉద్యోగుల వయోపరిమితి తగ్గింపు, పనితీరు మదింపు, తాజాగా ఉద్యోగుల కులం, రిటైర్మెంట్ వివరాలతో కూడిన నమూనాను రూపొందించి, దానిపై పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన జిల్లా అధికారులకు మెమోలు పంపించడం రెండోది.
చంద్రబాబు వల్లనే...
ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్ఠం జరుగుతుందని అంటున్నారు. చంద్రబాబు అధికారులకు ఇస్తున్న స్వేచ్ఛ కారణంగానే ఇలా జరుగుతోందని విమర్శలు టిడిపి వర్గాల నుంచి వస్తున్నాయి. చంద్రబాబు ఓ వైపు కేంద్రం నుంచి ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పోరాటానికి శ్రీకారం చుట్టారు. అధికారుల తీరు జగన్కు ఉపయోగపడుతుందని అంటున్నారు.
Recommended Video
ముద్రగడకు భయపడుతున్నారనే...
కాపు రిజర్వేషన్లపై ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు ఒకరోజు ముందు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని ఆర్ఐల నుంచి తహశీల్దార్లకు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేరోజు బీసీ కమిషన్ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరుతూ కమిషన్ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. గత నెల రోజులుగా ముద్రగడ తలపెట్టన పాదయాత్రపై చర్చ సాగుతోంది. ఇటువంటి స్థితిలో ముద్రగడ పాదయాత్రకు ఒకరోజు ముందు రెండు ఉత్తర్వులివ్వడం వల్ల ముద్రగడను చూసి ప్రభుత్వం భయపడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అంటున్నారు.
జగన్కు ఉపయోగపడే విధంగా...
మూడు రోజుల క్రింద ఉద్యోగుల వయోపరిమితి తగ్గింపు, పనితీరు మదింపు, తాజాగా ఉద్యోగుల కులం, రిటైర్మెంట్ వివరాలతో కూడిన నమూనాను రూపొందించి, దానిపై పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన జిల్లా అధికారులకు మెమోలు పంపిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి దూరమవుతారనే ఆందోళన టిడిపి వర్గాల్లో వ్యక్తమవుతోంది. వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం వల్ల ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో సానుకూలత ఏర్పిడింది. తాజా మెమో దాన్ని దెబ్బ తీసే విధంగా ఉందని అంటున్నారు. ఇది సహజంగానే జగన్కు ఉపయోగపడుతుందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇస్తున్న ఒక వర్గం ఉద్యోగ సంఘాలకు ఆయుధం ఇచ్చినట్లేనని అంటున్నారు.
యనమల ప్రకటనను నమ్ముతారా...
ఆ మెమోపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇచ్చిన వివరణతో కూడిన ఖండనను ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని, తాజా పరిణామాలతో తమకు మద్దతునిస్తున్న ఎన్జీవో సంఘం కూడా తమను తప్పు పడుతుందని టిడిపి నాయకులు అంటున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మెమో నెంబర్ 5373/ సిపిఆర్ అండ్ ఆర్డి/ జి1/ 2017; 26-7-2017 పేరుతో ఇచ్చిన కాపీలో ఉద్యోగుల వివరాలివ్వాలని బహిరంగంగా కనిపిస్తున్నా, దాన్ని కొట్టిపారేయటంతో ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు.
ఆ అధికారి ఎవరు....
నమ్మి ఓ అధికారికి చంద్రబాబు పెత్తనం ఇచ్చారని, అయితే ఆయన దేన్నీ సీరియస్గా తీసుకోవడం లేదని అంటున్నారు. ఆ అధికారి అనాలోచిత చర్యల వల్ల ఈ చిక్కులు వచ్చి పడ్డాయని అంటున్నారు. ఆ అధికారిపై తెలుగుదేశం పార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆ అధికారి చర్య వల్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
దుర్మార్గపు ప్రచారం..
రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచిందే తామేనని, అలాంటిది ఉద్యోగ వయోపరిమితిని ఎందుకు తగ్గిస్తామని, విషయంలో జరుగుతున్న కుట్రలను విశ్వసించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో ఉద్యోగుల సహకారం మర్చిపోలేమని, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చరిత్రాత్మకం. విభజనను వ్యతిరేకిస్తూ వారు చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన అన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అదో కుట్ర అని...
దాన్ని ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అగాధం పెంచేందుకు జరుగుతున్న కుట్రగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల మనసులో విషబీజాలు నాటుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగులను ప్రభుత్వం నుంచి వేరుచేసే శక్తుల పట్ల కఠినంగా ఉంటామని ఆయన అన్నారు. దీనిపై వాస్తవాలు ప్రజలు, ఉద్యోగులకు చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉందని అన్నారు. ఉద్యోగుల్లో అశాంతి నెలకొల్పడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు జరుగుతున్న కుట్రలు, వాటివెనుక కారణాలను గమనించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.