ఆ సోషల్ మీడియా పోస్టులతో...మా పార్టీకి సంబంధం లేదు:వైసిపి ప్రకటన
అమరావతి:వైసిపి పార్టీ కార్యకర్తలుగా,సానుభూతిపరులుగా ప్రచారం చేసుకుంటూ కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ విధంగా కొందరు తమ పార్టీ చెబుతూ సోషల్ మీడియాలో తమ పార్టీనే దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వైసిపి తమ ప్రకటనలో పేర్కొంది. కాబట్టి అలాంటి వాళ్లు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు గానీ, జగన్ కానీ ఏమాత్రం సంబంధం లేదన్నారు. జగన్ కోసం అంటూ వీళ్లు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పోస్టులతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఇలా తమ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నఇప్పాల రవీంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, యశ్వంత్రెడ్డి, ఆనం నరేంద్రరెడ్డి, ఎ.సతీష్రెడ్డితో తమ వైసిపికి సంబంధంలేదని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వైసిపి హఠాత్తుగా ఇలా సోషల్ మీడియా పోస్టుల విషయమై ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Recommended Video
వైసిపి ఇలా ప్రకటన చేయడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని టిడిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. టిడిపి తమపై కుట్ర పన్నుతుందనే కారణంతోనే లేక సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకునేవిధంగా చట్టం పటిష్టపరచడం వంటి చర్యలు కేంద్రం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీకి సమాచారం అందడమో జరిగి ఉంటుందని టిడిపి శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. దీంతో టిడిపి కూడా తమ సోషల్ మీడియా టీమ్ లను నియంత్రణలో ఉంచుకుంటే మేలని ఆ పార్టీ శ్రేణుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు.