ఆందోళన కొనసాగిస్తాం: అశోక్, టైటానిక్కేనన్న లగడపాటి
హైదరాబాద్/న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో బిల్లు పెడితే తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తాము చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆయన ప్రకటించారు.
శనివారం కూడా సీమాంధ్ర కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాలను చేపడతామని అశోక్ బాబు చెప్పారు. ఫిబ్రవరి 11న సీమాంద్ర వ్యాప్తంగా థియేటర్ల బంద్ నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 12న జాతీయ రహదారుల దిగ్బంధిస్తామని అశోక్ బాబు చెప్పారు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో చలో ఢిల్లీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఫిబ్రవరి నెలాఖరులోగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అశోక్ బాబు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు సమ్మె నుంచి మినహాయింపునిస్తున్నట్లు చెప్పారు. సమ్మెలో పాల్గొనాలని విద్యుత్ ఉద్యోగులను కోరనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే వచ్చే ఎన్నికల్లో రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు.
టైటానిక్ షిప్లా మునిగిపోతుంది: కాంగ్రెస్పై లగడపాటి
న్యూఢిల్లీ: రెండు సార్లు అధికారమిచ్చిన తెలుగుజాతిని చీల్చితే టైటానిక్ షిప్లా కాంగ్రెస్ మునిగిపోతుందని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హెచ్చరించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యత కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పారు.
ఓ ముఖ్య నేత కేంద్రానికి తప్పుడు సమాచారం ఇవ్వడమే ఈ దుస్థికి కారణమని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం తమ వద్ద ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఆటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు భాగస్వాములని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలను నిమిషం కూడా జరగనివ్వమని లగడపాటి స్పష్టం చేశారు.