తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను చేపడుతున్నట్లు మంగళవారం సభలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రకటించడంతో, ఆ పదవి కోసం తమ అభ్యర్థిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేరును అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఖరారు చేసింది. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో పోటీ కోసం ఆమెతో బుధవారం నామినేషన్ దాఖలు చేయించాలని పార్టీ నిర్ణయించింది.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడి పద్మా దేవేందర్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్ పదవికి అంగీకరింపజేశారు. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్, టిడిపి, బిజెపి నుంచి వచ్చింది. దీనిపై తెరాస సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా లేదు. అసెంబ్లీలో పూర్తి మెజార్టీ కలిగిన తామే డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకోవాలని నిర్ణయించింది.

ఈ మేరకు పద్మాదేవేందర్రెడ్డి బుధవారం డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ ముఖ్యులు తెలిపారు. అధికార పార్టీ మద్దతు ఉంటే తప్ప, విపక్షాలు స్వతంత్రంగా డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పోటీపడే పరిస్థితి లేదు. ఈమేరకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పద్మాదేవేందర్రెడ్డి ఏక్రగీవంగా ఎన్నిక కావడం లాంఛనమేనని తెరాస అధిష్ఠానం ముఖ్యులు తెలిపారు.
డిప్యూటీ స్పీకర్గా పద్మాదేవేందర్రెడ్డికి మద్దతు పలకాలని ఇరిగేషన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్రావు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావును కోరారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనపుడు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇచ్చే సంప్రదాయముందని ఎర్రబెల్లి గుర్తు చేశారు. కేసీఆర్ ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని ఆశిస్తున్నానని భట్టి విక్రమార్క అన్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తాయా, లేదా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications