లిక్కర కిక్ ఎఫెక్ట్: తొలిరోజే విషాదం: తల్లీ కుమార్తె ఆత్మహత్య.. కుటుంబం ఛిన్నాభిన్నం
చిత్తూరు: మద్యం షాపులను పునరుద్ధరించిన తొలిరోజే విషాదకర ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తి.. పీకల్దాకా మందు తాగి ఇంటికెళ్లాడు. తనను నిలదీసిన భార్యను చితకబాదాడు. అడ్డుగా వెళ్లిన కుమార్తెనూ కనికరించలేదు. ఆమెపైనా పిడిగుద్దులు కురిపించాడు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుంటూరుజిల్లాలో గ్రాండ్ సక్సెస్: ఇక గొడుగుతో వస్తేనే: మద్యం షాపుల వద్ద అంబ్రెల్లా ఫార్ములా
మృతుల పేర్లు జగదాంబ, నందిని. చాలాకాలంగా వారు పలమనేరులో టిఫిన్ సెంటర్ను నడిపిస్తున్నారు. జగదాంబ భర్త చొక్కలింగం ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. చొక్కలింగం మద్యానికి బానిస. లాక్డౌన్ సందర్భంగా ఇన్ని రోజుల పాటు మద్యం లేకుండా గడిపిన అతను.. సోమవారం షాపులను తెరవడంతో నియంత్రించుకోలేకపోయాడు. పలమనేరులోని గ్రీన్జోన్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరిచారు. రెండు మద్యం బాటిళ్లను కొనుగోలు చేశాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా మద్యాన్ని సేవిస్తూనే ఉన్నాడు.
మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను జగదాంబ నిలదీసింది. అతిగా మద్యం తాగొద్దని వారించింది. దీనితో ఆగ్రహించిన చొక్కలింగం మద్యం మత్తులో ఆమెను చితకబాదాడు. టిఫిన్ సెంటర్లోని వస్తువులను చెల్లాచెదరు చేశాడు. తల్లిని కొడుతున్నందుకు అడ్డుగా వచ్చిన నందినినీ వదల్లేదు. ఆమెపైనా పిడిగుద్దులు కురిపించాడు. చుట్టుపక్కల వారు వారించడానికి ప్రయత్నించినప్పటికీ.. వినిపించుకోలేదు. నడిరోడ్డుపైకి తోసేశాడు.
Recommended Video
దీనితో మనస్తాపానికి గురైన జగదాంబ, నందిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము నిర్వహిస్తోన్న టిఫిన్ సెంటర్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు చొక్కలింగంపై దాడి చేశారు. అతను పారిపోవడానికి ప్రయత్నిస్తుండటంతో అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతణ్ని అరెస్టు చేశారు.