నారా లోకేష్ పాదయాత్రకు ఊహించని ట్విస్ట్
నారా లోకేష్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్లోని ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించడమే కారణమని పలమనేరు డీఎస్పీ స్పష్టం చేశారు. తమ వాహనాన్ని ఆడుకోవడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. వాహనాన్ని ఎందుకు సీజ్ చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా నారా లోకేష్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. తమ వాహనాన్ని తమకు అప్పగించే వరకు కదిలేదు లేదని లోకేష్ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా క్లాక్ టవర్ దగ్గర వాహనంపైకి ఎక్కి మాట్లాడుతున్నారని, దీనికి అనుమతి లేదని డీఎస్పీ చెప్పారు. వాహనంపైకి ఎక్కి మాట్లాడినందుకు లోకేష్ కు నోటీసులిచ్చారు.
పాదయాత్రలో భాగంగా.. నారా లోకేష్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలపైనే ఎట్రాసిటీ కేసులు పెడుతున్న ముఖ్యమంత్రి జగన్ దళితద్రోహి అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం దెబ్బతీయడమే కాకుండా.. దళితులను చంపేసి మృతదేహాలను ఇంటికి డెలివరీ చేస్తోందని నిప్పులు చెరిగారు. వెదురుకుప్పం మండలం మారేపల్లి ఎస్సీ కాలనీలో దళితుడైన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. పర్యటించి వెళ్లగానే.. ఎస్సీ మహిళ మారెమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని లోకేష్ చెప్పారు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
యువగళం పేరుతో 400 రోజులపాటు పాదయాత్ర చేసేందుకు జనవరి 27వ తేదీన కుప్పంలో బయలుదేరిన లోకేష్ పలమనేరుకు చేరుకున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలను స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషిచేయడమే పాదయాత్ర లక్ష్యమని, యాత్ర పొడవునా గుర్తించిన సమస్యలన్నింటినీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగా సత్వరమే పరిష్కరిస్తుందని హామీ ఇస్తున్నారు.