కోడ్ ఉల్లంఘన: ఆస్పత్రిలో పళ్లంరాజు ప్రచారం
తూర్పుగోదావరి: కేంద్రమంత్రి, కాకినాడ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి పళ్లంరాజు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మంగళవారం ఉదయం ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రమే ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఆస్పత్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా రోగులను, వారి సహాయకులను కోరారు. ఆస్పత్రిలోని పలు వార్డుల్లో తిరుగుతూ ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రచార గడువు ముగిసినప్పటికీ ప్రచారం నిర్వహించడం పట్ల పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.
పార్థసారిథి వద్ద భారీ నగదు లభ్యం
విజయవాడ: మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థి పార్థసారథి బస చేసిన హోటల్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గదిలో భారీగా నగదు పట్టుబడ్డట్లు సమాచారం. కాగా, అంతకుముందే పెద్ద మొత్తంలో నగదును బయటికి పంపించినట్లు తెలిసింది. హోటల్లో పెద్ద మొత్తంలో నగదు ఉందన్న సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.