'జగన్కు, లోకేష్కు ఇవి తేడాలు, అందుకే వైసీపీ రాద్దాంతం'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఎలాంటి పోలిక లేదని, అహంకారానికి, అవినీతికి జగన్ నిదర్శనం అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం మండిపడ్డారు.
నారా లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే వైసిపి నేతలు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్కు, లోకేశ్కు ఏమాత్రం పోలిక లేదన్నారు. లోకేశ్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలోనే నాయకులకు సూచనలు ఇస్తారని. దానిని రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారన్నారు. ఏపీలో ఆ పార్టీ మరో వందేళ్లైనా కోలేకోలేదన్నారు. ఇథియోపియాలో బంధీలైన తెలుగు ప్రొఫెసర్లను కాపాడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ
ఏపీ సీఎం చంద్రబాబుతో రష్యా పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డేవిస్ మాంటురోవ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ - రష్యా ప్రభుత్వాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కాగా, జేఎస్సీ, యూఎస్సీ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు మధ్య అవగాహన ఒప్పదం కుదిరింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమన్నారు. రాష్ట్రం గతేడాది 10.99శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని, రాబోయే 15, 20 ఏళ్లలో పదిహేను శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలో రెండకెల వృద్ధిరేటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు.
తాను రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు వాణిజ్యమంత్రి మ్యాంటురోవ్ను అమరావతికి రావాల్సిందిగా ఆహ్వానించానని చెప్పారు. తన ఆహ్వానం మేరకు ఆయన రష్యా పరిశ్రమ ప్రతినిధులతో కలిసి అమరావతికి వచ్చారన్నారు.
ఏపీకి రష్యాతో వాణిజ్య సంబంధాలు మెండుగా ఉన్నాయని, ఇక్కడి నుంచి తేయాకు, పొగాకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖలో ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఐటీ, బయోటెక్నాలజీ, నీటిపారుదల రంగాల్లో మంచి అవకాశాలున్నాయన్నారు. రాయలసీమలో స్టీల్ప్లాంట్ పెట్టేందుకు ముందుకొస్తే సహకారం అందిస్తామన్నారు.