ఐవైఆర్ది విపరీత చర్య, అబద్ధాలు చెప్పారు: పరకాల ఆగ్రహం
ఏపీ సీఎం చంద్రబాబుకు ఐవైఆర్ కృష్ణారావు అంటే ఎంతో నమ్మకం ఉండేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. అందుకే ఆయనకు సీఎస్గా మూడేళ్ల పదవీ కాలం కల్పించారని చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అంటే ఎంతో నమ్మకం ఉండేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. అందుకే ఆయనకు సీఎస్గా మూడేళ్ల పదవీ కాలం కల్పించారని చెప్పారు. ఐవైఆర్ కృష్ణారావు మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన కొద్దిసేపటికే పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు నిబంధనలకు లోబడి ప్రవర్తించాలని, మాట్లాడాలని అన్నారు. మూడు దశాబ్దాలపాటు ఆలిండియా అధికారిగా, రాష్ట్ర సీఎస్ గానూ పని చేసిన ఐవైఆర్ కృష్ణారావుకు వీటిపై చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినట్లు, సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఐవైఆర్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని పరకాల చెప్పారు. సీఎంను కలిసే స్వేచ్ఛ ఆయనకు ఎప్పుడూ ఉండేదని అన్నారు. ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నెలలో కూడా ఆయన సీఎంను కలిశారని చెప్పారు. సూచనలు చేయవచ్చు కానీ, బహిరంగంగా విమర్శించడం సమంజసమా? అని అన్నారు.
ఇది సమర్థనీయమా? అని ప్రశ్నించారు. వారి(బ్రాహ్మణ) కార్పొరేషన్లో ఏదైనా ఉంటే సిబ్బంది సోషల్ మీడియాలో పెడితే ఆయనకు కూడా రుచించదనే తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఐవైఆర్ది విపరీత దోరణి అని పరకాల అన్నారు. అత్యంత అభ్యంతరకరమని చెప్పారు. అనుభవజ్ఞులైన వారు ఇలా చేస్తారని తాము ఊహించలేదని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.
ఎన్నో ఉన్నత బాధ్యతలు చేపట్టిన వారు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి భజన చేయాలని తాము ఎప్పుడు అనలేదని, అలా అనడం కూడా జరగదని పరకాల స్పష్టం చేశారు. ఆయనంటే గౌరవముందని చెప్పారు. అయితే ఆయన ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు.
అసెంబ్లీ, మండలి, దళిత శాసనభ్యురాలికి వ్యతిరేకంగా పెట్టిన సోషల్ మీడియాకు స్పందించడం సరికాదన్నారు. తప్పులేమైనా జరిగివుంటే మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు చెప్పాలి కానీ, ఇలా బహిరంగంగా వ్యక్తపర్చడం సరికాదని అన్నారు. సినిమా గురించి, టీటీడీ గురించో, సోషల్ మీడియా గురించి, గౌతమి సినిమాలో చరిత్ర ఎంతుంది?.. బాహుబలి బాగుందా బాగా లేదా? అనే విషయాలపై స్పందించాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు.
ఐవైఆర్ది అనవసర వివాదమని అన్నారు. కార్పొరేషన్లకు రాజకీయాలతో సంబంధం ఉండదన్నారు. జీవో 219 ప్రకారమే ఐవైఆర్ను బ్రాహ్మణ కొర్పొరేషన్ నుంచి తొలగించబడ్డారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రఘుపతిని కలవడంపై ప్రశ్నించగా.. ఐవైఆర్ కృష్ణారావుకు ఎవరినైనా కలిసే స్వేచ్ఛ ఉందని, ఇందులో అభ్యంతరమేం లేదని అన్నారు. వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతుందని ప్రశ్నించగా.. దానిపై తమకేమీ సమాచారం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications