రేప్ చేసి, హత్య చేశారు: తేజస్విని తల్లిదండ్రుల ఆరోపణ
గుంటూరు: తమ బిడ్డపై అత్యాచారం జరిపి, చంపారని మృతురాలు తేజస్విని కుటుంబసభ్యులు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని రింగ్రోడ్డు సెంటర్లో ధర్నా చేశారు. శుక్రవారంనాడు స్నేహితుల రూంలో తేజస్విని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సంఘటన కేసును పోలీసులు తారుమారు చేస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
తేజస్విని తన స్నేహితుడిగా భావిస్తున్న యువకుడి గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు భావించిన విషయం తెలిసిందే. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్విని గురువారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. దీంతో చుట్టుపక్కల అంతా వెతికిన తల్లిదండ్రులు.. శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే సమయంలో ఉదయం అక్కడకు సమీపంలోని ఓ ఇంట్లో ఒక యువతి ఉరి వేసుకుని మరణించినట్లు ఆ ఇంటి యజమాని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా.. ఆ మృతదేహం తేజస్వినిదే అని తెలిసింది. కాగా, ఆ యువతి నరసింహరావు అనే యువకుడు అద్దెకు ఉండే గదిలో శవమై కనిపించడంతో అతడి కోసం పోలీసులు వాకబు చేస్తున్నారు.
తాను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన నరసింహరావు.. తన ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడని ఇంటి యజమాని చెప్పాడు. అయితే అతడి అసలు పేరు నాగరాజు అని పోలీసుల విచారణలో తెలిసింది. అతడు తన పేరు, ఆచూకీ వివరాలు కూడా ఎందుకు రహస్యంగా ఉంచాడో తెలియరాలేదు.
అసలు అతడెవరో తమకు గానీ, తమ కుమార్తెకు గానీ తెలియదని తేజస్విని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి ఆమె అక్కడకు ఎందుకు వెళ్లిందో, ఆమె తనకు తానే ఉరేసుకుందా.. లేక ఏమైనా అఘాయిత్యం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.