కడుపు తీపి కరువాయె..: కూతురిని కోర్టులో వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు
కడప: చెట్టుకు కాయభారం కాదు గానీ ఆ తల్లిదండ్రులకు కూతురు భారమైనట్లు కనిపిస్తోంది. భార్యాభర్తలు తగాదాపడి కూతురిని కోర్టు ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రులుండీ ఆ బాలిక అనాథ అయింది.
వరకట్న వేధింపుల నేపథ్యంలో భార్యాభర్తలు కోర్టు మెట్లు ఎక్కారు.
ఈ స్తితిలో దంపతులు ఏడాదిన్నర వయసున్న తమ బిడ్డను నాకు వద్దంటే.. నాకు వద్దంటూ వదిలేసి వెళ్లారు. తల్లీదండ్రులిరువురూ వదిలేసి వెళ్లడంతో ఆ చిన్నారి ఎక్కిళ్లు పట్టి ఏచ్చిన దృశ్యం కోర్టులో ఉన్న వారందరినీ కలచి వేసింది. ఈ ఘటన కడప ఫ్యామిలీ కోర్టు ఆవరణలో గురువారం చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి - కడప నగరానికి చెందిన ఈశ్వర్, విజయభారతి భార్యాభర్తలు. వీరికి సాయికీర్తి అనే ఏడాదిన్నర చిన్నారి ఉంది. ఈశ్వర్పై 2014లో విజయభారతి వరకట్నం కేసు పెట్టింది. అప్పటి నుంచి వారిద్దరు విడివిడిగా ఉంటున్నారు. పాప తల్లి వద్దే ఉంటోంది.

కడప ఫ్యామిలీ కోర్టులో వరకట్న వేధింపుల కేసు గురువారం విచారించిన న్యాయమూర్తి నెలకు రూ.3500 చొప్పున విజయభారతికి జీవనభృతి చెల్లించాలని ఈశ్వర్ను ఆదేశించారు. అయితే ఈ మొత్తం తన అవసరాలకు సరిపోదని, కుమార్తెను భర్తే చూసుకోవాలని పాపను అక్కడే వదిలేసి విజయభారతి వెళ్లిపోయింది.
ఈశ్వర్ కూడా తనకేమీ పట్టనట్లు వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారి ఎక్కిళ్లు పెట్టి ఏడవసాగింది. దీంతో న్యాయమూర్తి చిన్నారి సాయికీర్తిని శిశుసంరక్షణ గృహానికి అప్పగించారు.












Click it and Unblock the Notifications