27 ఏళ్లకే మూడు హత్యలు: అనంతలో పరిటాల అనుచరుడు దారుణహత్య
అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్న భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లా రాజకీయాలను శాసించాలని భావిస్తున్న టీడీపీకి చెందిన కొందరు యువ నేతలు నేరస్తులు అండతో మరితంగా రెచ్చిపోతున్నారు.
గురువారం అనంతపురం పట్టణంలోని చంద్రబాబు నగర్లో జరిగిన పరిటాల శ్రీరామ్ అనుచరులు గోపి నాయక్, వెంకటేష్ నాయక్ల హత్యలను ఇందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... గురువారం మధ్యాహ్నాం ఆటోలో కూర్చొని ఉన్న గోపి నాయక్, వెంకటేష్ నాయక్లను వేటకొడవళ్లతో అత్యంత కిరాకతంగా నరికి చంపారు.
ఈ ఘటనలో వాళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందడంతో దుండగులు పరారయ్యారు. కాగా హత్యకు గురైన గోపినాయక్ వయసు 27 ఏళ్లే. కానీ ఇతడిపై ఇప్పటికే మూడు హత్య కేసులు నమోదయ్యాయని స్థానిక సీఐ సాయిప్రసాద్ చెప్పారు. ముదిగుబ్బకు చెందిన గోపినాయక్ కొద్దిరోజుల క్రితమే అనంతపురం వచ్చాడు.
తొలుత చిన్నచిన్న దందాలు చేసే ఇతను ఆ తర్వాత వెంకటేశ్, ఆకులప్ప, అమర్తో కలిసి ఒక గ్రూప్ను ఫామ్ చేశాడు. అలా అందరూ కలిసి సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టారు. నగర శివారులో కొత్త భూములు కొనాలన్నా అమ్మాలన్నా వీరి కనుసన్నల్లోనే జరిగేవి. వీరికి పరిటాల కుటుంబం అండ ఉండటంతో మరింత రెచ్చిపోయారు.
ఇటీవల అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ నగర శివారులోని వికలాంగుల కాలనీలో ఒక్కొక్కరి నుంచి రూ. 50వేలు వసూలు చేశారు. ఆ డబ్బు విషయంలోనే గోపినాయక్కు ఆకులప్ప, అమర్ గ్రూప్లకు మధ్య గొడవ మొదలైంది.
దీంతో గోపినాయక్, వెంకటేశ్ నాయక్ (31)లను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. ప్రాణభయంతో గోపినాయక్ కేకలు వేసినా ప్రత్యర్థులు అతడిని వెంటాడి మరీ దారుణంగా చంపారు. హతులు గోపినాయక్, వెంకటేశ్ మృతదేహాలను శుక్రవారం ఆసుపత్రిలో మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పరిశీలించారు.
ఈ హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హస్తముందని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. దీంతో పాటు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలను ప్రభుత్వ కార్యాలయాలకు పిలిపించి మరీ హత్యలు చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.