రైలు ఢీకొని మంత్రి పరిటాల సునీత బంధువు సహా ఇద్దరు దుర్మరణం
అమరావతి: అనంతపురం జిల్లాలోని రాప్తాడులో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఓ ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువు సహా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.
వివరాల్లోకి వెళితే రాప్తాడు మండలం ప్రసన్నాయుని పల్లి వద్ద రైలుని ఢీకొని ఇద్దరు చనిపోయారు. మృతులిద్దరూ రిలయన్స్ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రసన్నాయునిపల్లిలో రిలయన్స్ 4జీ టవర్ ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు.
అదే సమయంలో రైలు వస్తున్న విషయాన్ని గుర్తించని వీరిద్దరూ ట్రాక్ పైకి వెళ్లగా వేగంగా దూసుకువచ్చిన రైలు వారిద్దరినీ ఢీకొట్టింది. మృతుల్లో ఒకరు మంత్రి పరిటాల సునీత సమీప బంధువు గిరినాయుడు కాగా, మరొకరు గుంటూరు జిల్లాకు చెందిన అరవింద్ కుమార్గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు.