కూలీలతో కల్సి నాట్లేసిన పరిటాల సునీత, క్యూలో అశోక్
హైదరాబాద్/అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పొలంలో నాటు వేశారు. సునీత ఆదివారం అనంతపురం నుండి తన స్వగ్రామం అయిన వెంకటాపురానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ఉన్న కొత్తపల్లి గ్రామం వద్ద నాటు వేస్తున్న మహిళా రైతుల, కూలీల వద్ద ఆగారు.
వారి నుండి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో ఆమె వారితో పాటు వరి మడిలోకి దిగి నాటు వేశారు. అంతేకాదు, నాటు వేసే సమయంలో ఉత్సాహం కోసం పాటలు పాడుతుంటారు. మంత్రి సునీత కూడా వారితో పాటు గొంతు కలిపారు. సునీత తమతో పాటు నాట్లు వేయడం చూసి మహిళలు ముచ్చటపడ్డారు.
అశోక గజపతి రాజు 'సామాన్యుడు'
తెలుగుదేశం పార్టీ నేత, కేంద్రమంత్రి అశోక గజపతి రాజు ప్రత్యేక హోదాను ఉపయోగించుకోకుండా సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. మంత్రిగా ఆయన వరుసలో నిలబడాల్సిన అవసరం లేదు.
ఓ ప్రత్యేక వాహనంలో ఆయనను విమానం దగ్గరకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు ఉంటాయి. కానీ, అశోక గజపతి రాజు వాటిని పక్కన పెట్టి, మిగతా ప్రయాణీకులలాగా బస్సులో విమానం వద్దకు వచ్చారు. అంతేకాదు, ప్రయాణీకులతో పాటు వరుసలో నిలబడ్డారు.