జనసేన టు వైసిపి: రాజధాని విషయంలో చంద్రబాబు ఏకాకి!
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటరివాడయ్యారని సిపిఎం సిఆర్డీఏ విభాగం కన్వీనర్ సిహెచ్ బాబూరావు పేర్కొన్నారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ సోమవారం ఉండవల్లి సిఆర్డీఏ కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడించారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ సమీకరించిన భూమిలో రైతులకు పరిహారంగా ఇస్తామన్న భూమి ఎక్కడో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వంలోని కొందరు బినామీ పేర్లతో రాజధానిలో భూములు కొనుగోలు చేసి నల్లడబ్బుని, తెల్లడబ్బుగా మారుస్తున్నారన్నారు.
భూసేకరణ విధానాన్ని బిజెపి, టిడిపి మినహా అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. పంటలు పండే భూములను సేకరించి వాటిని బీడు పెట్టొద్దని, రైతుల భూములను కాపాడాలన్నారు.

మరో నాయకుడు రామారావు మాట్లాడుతూ... ప్రభుత్వం చెబుతున్న శాటిలైట్ లెక్కల సమాచారం తప్పుల తడకగా ఉందని, ఇప్పటి వరకూ సమీకరించిన 33వేల ఎకరాల భూమి చాలదన్నట్లు, సేకరణ పేరుతో పేదల భూమలు తీసుకోవటం ఎవరికోసమో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, రాత్రివేళల్లో మంత్రులు రాజధాని గ్రామాల్లో దొంగల్లాగా తిరుగుతూ స్థానిక టిడిపి కార్యకర్తల ద్వారా రైతులకు మాయమాటలు చెప్పి భూసమీకరణకు, సేకరణకు ఒప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయటం, మీడియా ముందు అంతా బావుందని చెప్పటం సరికాదని ఇంకొందరు చెప్పారు.
ఇదిలా ఉండగా, రాజధాని కోసం బలవంతపు భూసేకరణను టిడిపి మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విపక్షాలు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిజెపిలో కూడా పలువురు నేతలు బలవంతపు భూసేకరణ వద్దని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications