తిరుమలలో చూసి తీరాల్సిన శ్రీవారి ప్రణయకలహోత్సవం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
సోమవారం నాడు 74,800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,726 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలో నేడు శ్రీవేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం జరుగనుంది. దీనికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మకర సంక్రాంతి పర్వదినం మరుసటి రోజున పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అత్యంత ఘనంగా జరుగనుందీ ఉత్సవం.
ఈ సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారిని సంప్రదాయ క్షత్రియ వేటగాడి వేషం ధరింపజేస్తారు. శంఖు, చక్రం, గద, బాణం, ఖడ్గం వంటి పంచాయుధాలతో పార్వేట మండపానికి తీసుకు వెళ్తారు. ఆనంద నిలయం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందీ మండపం. స్వామివారి తరఫున అర్చకుడు బంగారంతో చేసిన బల్లెంతో వేటను కొనసాగిస్తారు.
అదే రోజున గోదాపరిణయోత్సవాన్ని నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు. ఈ ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్తారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి నివేదిస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.
ఆయా ఉత్సవాలు, కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు నేడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications