పార్టీతో పవన్ ఢీ: ఒత్తిడిలో చిరు, ఏంచేయాలో తెలియక..
తనకు అన్నీ అభిమానులే అని తరచూ చెప్పే చిరంజీవి... వారి పైన తన ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేయడం చూస్తుంటే ఆయన ఒత్తిడిలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. పవన్ పార్టీ స్థాపించడాన్ని చిరంజీవి ఆహ్వానించిప్పటికీ.. సొంత తమ్ముడు తనకు వ్యతిరేకంగా పార్టీని స్థాపించి, బిజెపితో చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు.
పవన్ కళ్యాణ్ అన్నయ్య కారణంగానే సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చారనేది నిర్వివాదం. ఇదే విషయాన్ని పవన్ కూడా చెబుతారు. జనసేన పార్టీ ప్రకటన సమయంలో పవన్ మాట్లాడుతూ.. తాను అన్నయ్యకు వ్యతిరేకంగా ఉండటం తన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
పవన్ పార్టీ పెడతారని అంతకుముందు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై చిరంజీవి నాగబాబు ద్వారా, ఆ తర్వాత స్వయంగా పవన్ను ప్రశ్నించారు. కానీ, కాంగ్రెసు పార్టీ అంటేనే మండిపడే పవన్... జనసేన పార్టీని స్థాపించారు. బిజెపితో కలిసి అన్నయ్యతో ఢీకొట్టేందుకు సిద్ధపడ్డారు. పార్టీ పెట్టడమే కాకుండా... బిజెపితో చేతులు కలపడాన్ని చిరు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు.
అదే సమయంలో ఎక్కువ మంది అభిమానులు కూడా పవన్ వైపు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది కూడా ఆయనకు మింగుడు పడటం లేదంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు తాము ఆయన వెంటే ఉన్నామని కానీ, కాంగ్రెసు పార్టీలో చేరడాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నామని, అందుకే తాము చిరును అభిమానిస్తున్నప్పటికీ... రాజకీయంగా పవన్ వెంట అడుగులు వేస్తున్నామని జనసేనకు మద్దతిచ్చే అభిమానులు చెబుతున్నారు.
ఈ పరిణామాలు అన్ని చిరుకు మింగుడు పడటం లేదంటున్నారు. తన బస్సుయాత్ర సమయంలో ఆయన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమంటున్నారు. చిరంజీవి అంటేనే ఇసుక రాలనంత జనం తరలి వస్తారు. అలాంటిది చిరు బస్సుయాత్రకు ఆదరణ లభించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిరు స్పందిస్తూ.. కుర్చీలు ఖాళీ ఉంటున్నాయని మీడియా అసత్య ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇక గురువారం అయితే.. పవన్ జిందాబాద్ అన్నందుకు ఓ అభిమానిని షటప్ అంటూ నోరు మూయించారు.