అనంతపురం చేరుకున్న పవన్ కళ్యాణ్: సర్వం సిద్ధం, 3రోజుల పర్యాటన సాగుతుందిలా
Recommended Video
అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి అనంతపురంకు బయల్దేరారు. ఉదయం 10.45 ప్రాంతంలో ఆయన అనంతపురంకు చేరుకున్నారు.
కాగా, పవన్ రాకకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశాయి. ముందుగా ప్రకటించిన విధంగానే.. పార్టీ కార్యాలయానికి శనివారం భూమిపూజ నిర్వహించనున్నారు. ఈక్రమంలో అనంతపురం, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
కరువుపై అధ్యయనం
రైతులు, కర్షక, శ్రామిక, చేనేత వర్గాల ప్రతినిధులు, మేధావులతో సమావేశం కానున్నారు. చలోరె.. చలోరె.. చల్' కార్యక్రమంలో భాగంగా జిల్లా కరవుపై అధ్యయనం, అవగాహన కోసం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ముఖాముఖి చర్చలు
గుత్తిరోడ్డులోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జనసేన ప్రజావేదికలో ‘సీమ కరవుకు పరిష్కార మార్గాలు' అనే అంశంపై రైతులు వ్యవసాయ, నీటిపారుదల నిపుణులతో ముఖాముఖి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ ముఖ్యులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. అనంతరం రాత్రికి నగరంలో బస చేస్తారు.
కదిరి లక్ష్మీనర్సింహస్వామి దర్శనం
28న ఉదయం 11 గంటలకు కదిరికి చేరుకుంటారు. కదిరిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని కరవు పరిస్థితులపై స్థానిక రైతులతో చర్చించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం పుట్టపర్తి చేరుకుని హనుమాన్ జంక్షన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం పుట్టపర్తిలోని సత్యసాయి మందిరం, మంచినీటి పథకం, ఆసుపత్రిని సందర్శిస్తారు. రాత్రికి పుట్టపర్తిలో బస చేస్తారు.
ధర్మవరం, హిందూపురం
జనవరి 29న ఉదయం ధర్మవరం చేరుకుని చేనేత కార్మికులతో సమస్యల గురించి చర్చించి హిందూపురం వెళ్తారు. పురంలో మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాస్థాయి జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొని.. సాయంత్రం చిక్కబళ్లాపురలోని సీవీవీ ఇన్స్టిట్యూట్కు వెళ్లనున్నారు. అనంతరం హైదరాబాద్కు బయల్దేరతారు.