వారిలా ఒళ్లు బలిసి మాట్లాడను, ఎన్ని కష్టాల మధ్య: పెళ్లిళ్లపై పవన్, ఫ్లెక్సీలు తొలగింపు
Recommended Video
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై పరోక్షంగా మండిపడ్డారు. అందరు బాగుండాలనే ఉద్దేశ్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఇతరులలాగా ఒళ్లు బలిసి మాట్లాడనని చెప్పారు. ఎవరి వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితి జరిగిందో ఎవరికి తెలుసునని ప్రశ్నించారు.
పవన్కు క్షమాపణలు చెప్పకుంటే: జగన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తోన్న కాపునాడు
ఎన్ని కష్టాలు, బాధల మధ్య సంఘటనలు జరుగుతాయో వాళ్లకు తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయాలు చేయడానికి పెట్టి పుట్టనక్కరలేదన్నారు. సహనం, తెగింపు, బలమైన సంకల్పం కావాలన్నారు. నేను నారా లోకేష్లాగా కంఫర్ట్ జోన్ నుంచి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. చాలా క్లిష్టపరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
అరుపులు, కేకలు మాని అలా చేయండి
2019 ఎన్నికలు చాలా కీలకమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అరుపులు, కేకలు కాకుండా ఓట్లు నమోదు చేయించుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. నేను బయటకు వెళ్తే పోలీసులకు భయపడతానని చెప్పారు. పోలీసులు ఆపితే కేసులు పెడతారేమోనని భయపడతామన్నారు. ఒక్కరు ఏమీ చేయలేరని, అందరం కలిస్తేనే శక్తిగా మారగలమని అన్నారు.
ఖుషీ సమయంలోనే పార్టీ ఆలోచన
రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఖుషీ సినిమా సమయంలోనే వచ్చిందని పవన్ అన్నారు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో.. ఎంత క్షోభ అనుభవించానో ఎవరికీ తెలియదన్నారు. భగత్ సింగ్ ప్రాణత్యాగమే నాకు స్ఫూర్తి అన్నారు. మహిళల రక్షణ కోసమూ జనసేనను స్థాపించానని అన్నారు.
ఇలాంటి వ్యవస్థ మారాలి
సామాజిక, రాజకీయ వ్యవస్థను మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్టులు రాజ్యమేలుతారని పవన్ అన్నారు. స్వార్థం లేని వారే రాజకీయాల్లో ఉండాలన్నారు. ఆడవారు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లని గాంధీ అన్నారని, కానీ నేడు ఆడపిల్లలు పగలు కూడా రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉందన్నారు. 2019 రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమన్నారు. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. తుపాకీతో కాల్చేసినోళ్లు, దోపిడీలు చేసి చట్టం నుంచి తప్పించుకున్న వాళ్లు ప్రజల మీద పెత్తనం చేస్తున్నారన్నారు. దోపిడీదారులు కోట్లు సంపాదిస్తుంటే పీజీ, పీహెచ్డీలు చేసిన విద్యావంతులు వాళ్ల కింద పనిచేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యవస్థ మారాలన్నారు. ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకు కోపం, మాట్లాడకపోతే ఏపీ ప్రజలు తిట్టే పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
జగన్ను నేనూ తిట్టగలను కానీ
లోకేష్లా అనుకూలంగా ఉన్నప్పుడు రాలేదన్నారు. లోకేశ్ ఏ పనికి ఎంత వస్తుంది అన్న స్వార్థంతో పాలసీలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. జగన్లా తాను బాగా తిట్టగలనని, తనకూ పెద్ద నోరు ఉందని, కానీ ఒకరినొకరు తిట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. రాజకీయ నాయకులు చేసే పాలసీల వల్ల సామాన్యుడు ఇబ్బంది పడకూదన్నారు. అందుకే మరో పాతికేళ్లు తన జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
జగన్ను, సోదరి షర్మిలను లాగడంతో..
కాగా, అంతకుముందు జగన్ మాటల వివాదానికి స్వస్తి పలకాలని జనసేనాని విజ్ఞప్తి చేశారు. జగన్ వ్యాఖ్యలతో కలత చెందిన అభిమానులు కొందరు.. జగన్, ఆయన సోదరి షర్మిలను వివాదంలోకి లాగారు. 16 నెలలు జైల్లో ఉండి మీరు మాట్లాడటమా అని, పాదయాత్ర పేరుతో ముద్దులు కురిపించే వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అదే సమయంలో షర్మిలను కూడా వివాదంలోకి లాగారు. ఆమె పెళ్లి తదితర అంశాలపై స్పందించారు. దీంతో పవన్.. జగన్ ఇంటి ఆడపడుచులను వివాదంలోకి లాగవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు.
జనసేన కార్యకర్తల ఆందోళన
మరోవైపు, భీమవరం మండలం పెదఅమిరంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పంచాయతీ అధికారులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో పంచాయతీ అధికారులతో జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీ నేతలు కావాలనే తొలగిస్తున్నారని ఆరోపించారు.