సినిమా వదిలేస్తా, నా కోరిక అదే: పని పడుతానని పవన్
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల ప్రజల అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని, అవసరమైతే సినిమాలు వదిలేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం అన్నారు. ఆయన ఆదివారం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజల్లో విద్వేషాలను పెంచి పోషిస్తున్న తెరాసకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. తెరాస నేతల మాటలు చేటు తెస్తున్నాయని, వారు బాధ్యతగా మాట్లాడాలన్నారు.
బంగారు తెలంగాణ కోసం జనసేన అహర్నిశలూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం జైలు కెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తనను తిడుతున్నారని, భయపెట్టాలని చూస్తున్నారని, సహనంతో ఉంటున్నానని, ఇది అసమర్ధత కాదని, తాను ఎవ్వరికీ భయపడనని, తిడితే భరిస్తా.. హద్దు మీరితే పని పడతానని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చదివి వచ్చానని, అదే స్ఫూర్తితో అన్యాయం, అక్రమాలపై పోరాడే ధైర్యం వచ్చిందన్నారు.

ఎవరు అన్యాయానికి పాల్పడినా.. దౌర్జన్యానికి దిగినా వారి తాట తీస్తానన్నారు. బిసి నేత నరేంద్ర మోడీని విమర్శిస్తే అంతు చూస్తామన్నారు. తాను ఎన్నడూ తెలంగాణకు అడ్డు చెప్పలేదని, తనకు తెలంగాణ అంటే గౌరవం.. ఇష్టమన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యతతో మాట్లాడాలని, తనను తిట్టినవాళ్ల పని పడతానన్నారు. మనలో నిజాయితీ ఉన్నంతవరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
అన్యాయం ఎక్కడ జరిగినా, చివరకు పాకిస్తాన్లో జరిగినా పోరాడుతానని చెప్పారు. ప్రజల కోసం పోరాటం చేసే సత్తా తనకు ఉందన్నారు. ఫ్లోరిన్ లేని నల్లగొండ.. వలసలు లేని పాలమూరు.. చేనేతన్నల ఆత్మహత్యలు లేని సిరిసిల్ల.. వంటి మాటలు కెసిఆర్ ప్రసంగంలో వినాలని తన కోరిక అన్నారు. రాజకీయమంటే రెండున్నర గంటల సినిమా కాదన్నారు. లీడర్ సినిమా అంతకన్నా కాదన్నారు. తనమీద దాడులు చేస్తారనే భయం లేదన్నారు.
జనం కోసం పోరాటం చేస్తానని చెప్పారు. అవసరమైతే సినిమాలను వదిలేసి ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తానన్నారు. ప్రజల ఆనందం కోసం అవసరమైతే సినిమాలూ తీస్తానని చెప్పారు. తెలుగుదేశం, బిజెపి అభ్యర్థులకు ఓట్లు వేయాలని తన కోసం కోరడంలేదన్నారు. మీ భవిష్య త్తు, అభివృద్ధి కోసం వేయమని కోరుతున్నానని చెప్పారు. కెసిఆర్ ప్రసంగం వినిపించని తెలంగాణ సాధనే లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications