Pawan Kalyan : గోదావరి నుంచి వారాహి టూర్ వెనుక ? కారణం వెల్లడించిన పవన్...!
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే కాకినాడ జిల్లా పూర్తి చేసుకున్న ఈ యాత్ర ప్రస్తుతం కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోకి ఈ యాత్ర అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జనసేన నేతలతో భేటీ అయిన పవన్.. అసలు ఈ యాత్ర గోదావరి జిల్లాల్లోనే ఎందుకు మొదలుపెట్టాల్సి వచ్చిందో వెల్లడించారు.

బలం ఉన్న చోట నుంచే యుద్ధం మొదలు పెట్టాలని, జనసేన పార్టీకి ఉభయగోదావరి జిల్లాకు మంచి పట్టు ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గోదావరి జిల్లాల్లో తమకు దాదాపు 18 శాతం ఓటు బ్యాంకు ఉందని పవన్ తెలిపారు. ముందుగా వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తి చేయగలిగితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. మనల్ని పాలించే నాయకుడు మనకంటే నిజాయతీపరుడైతేనే మనకు న్యాయం జరుగుతుందన్నారు.

నిన్న రాజోలు మెయిన్ రోడ్డులో ప్రయాణం పడవ ప్రయాణంలా సాగిందని, అడుగుకో గుంతపడి ప్రయాణం నరకంగా మారిందని పవన్ తెలిపారు. వాహనమిత్ర పేరుతో ఇస్తున్న పది వేల రూపాయలు ఆటోల రిపేర్లకు కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారన్నారు. ఆక్వా పరిశ్రమ వల్ల భూగర్భ జలాలు నాశమైపోతున్నాయని, తాగటానికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొందని పవన్ వెల్లడించారు. ఆక్వా పరిశ్రమ వల్ల డబ్బులు వస్తాయి కానీ డబ్బులను తాగలేం కదా అన్నారు.

కోనసీమ నుంచి ఒ.ఎన్.జి.సి., గెయిల్, రిలయన్స్, వేదాంత ఇలా అనేక ఆయిల్ కంపెనీలు ఇక్కడ నుంచి ఆయిల్ నిక్షేపాలను తరలిస్తున్నాయని పవన్ తెలిపారు. పైప్ లైన్ లీకులు వల్ల బ్లో అవుట్లు జరిగి వాతావరణం కలుషితం అవుతుందన్నారు. ప్రజలు మృత్యువాత పడుతున్నారని, ఆయిల్ కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం వాటాను ఇక్కడి ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయాలని పవన్ కోరారు. కానీ క్షేత్ర స్థాయిలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. పార్టీలో వర్గాలు ఉండటం తప్పు లేదని, అందరూ కలిసి జనసేన గెలుపుకు కృషి చేయాలి తప్పితే... వర్గాల పోరులో పార్టీ ఓడిపోకూడదన్నారు. జనసేన గెలుపు ప్రజల గెలుపు అది గుర్తు పెట్టుకొని నాయకులు పనిచేయాలని పవన్ సూచించారు.












Click it and Unblock the Notifications