తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం: కేసీఆర్కు జనసేన అండ తేలిపోనుంది!
అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనానికి ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో పవన్ మద్దతు కోసం ముఖ్యమైన పార్టీలు ఎదురు చూస్తాయి. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంలో జనసేనాని పాత్ర ఎంతో ఉంది. తెలంగాణలోను పెద్ద ఎత్తున అభిమానగణం ఉంది.
కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని అకస్మాత్తుగా రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించిన పవన్ తెలంగాణలో పోటీ చేయలేకపోయారు. తెలంగాణలో పోటీపై కొద్ది రోజులు తర్జన భర్జన పడ్డారు. అలాగే, లెఫ్ట్ పార్టీలు ఆయన అండతో తెలంగాణ ఎన్నికల రంగంలోకి దిగాలని చూశాయి.

అందుకే తెలంగాణలో జనసేన పోటీకి దూరం
కానీ నిర్ణీత సమయానికంటే ముందు ఎన్నికలు రావడంతో పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయారు. 2019 లోకసభ ఎన్నికలతో పాటు తెలంగాణలోను అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు వచ్చింది. హఠాత్తుగా వచ్చినందున జనసేన పోటీకి దూరంగా ఉంది.

తెరాస కోసం జనసేన, వైసీపీ పాటుపడుతున్నాయని ప్రచారం
అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మద్దతు కోసం పలు పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అంతర్గతంగా ఆయన తెరాసకు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ఏపీకి చెందిన కీలక పార్టీలు అయిన జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తెరాస గెలుపు కోసం ఆయా నియోజకవర్గాల్లో అనధికారికంగా పాటుపడుతున్నాయనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
ఈ మేరకు జనసేన ట్వీట్ చేసింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నారని, జనసేన తన పార్టీ అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియజేస్తుందని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ మద్దతు తెరాసకా?
ఏపీలో చంద్రబాబుకు వ్యతిరకంగా పవన్ కళ్యాణ్ ఇటీవల గొంతెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాకూటమికి అండగా నిలబడే అవకాశాలు లేవు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. కాబట్టి ఆ పార్టీకి అండగా ఉండే అవకాశం లేదు. అలాగే, ఇటీవల ఆయన తెరాసకు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెరాసకు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే కేసీఆర్కు అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఇటీవల కేటీఆర్ కూడా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా తమ పాలనను మెచ్చుకున్నారని చెప్పారు. ఇది కూడా హింట్ అని కొందరు భావిస్తున్నారు. అలా కాకుండా అభిమానులు, తెలంగాణలోని పార్టీ కార్యకర్తలు వారి అభీష్టం మేరకు ఓటు వేయమని చెబుతారా అనే చర్చ కూడా సాగుతోంది. పవన్ అభిప్రాయంపై అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications