సీఎం జగన్ నిర్ణయాలపై పోరాటం: జనంలోకి పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు ఖరారు..!
కొద్ది రోజులుగా పార్టీ నుండి వలసలతో ఇబ్బంది పడుతున్న జనసేనాని..ఇప్పుడు ఆ ప్రభావం పార్టీ పైన పడకుండా కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత వెంటనే పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించిన పవన్ కల్యాణ్..మరోసారి జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా జగన్ పాలన ఆరు నెలల వరకు చూసి..ఇక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేంగా ప్రజల్లోనే పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ తొలి వారం నుండి ప్రతీ జిల్లాల్లో పర్యటన చేసే విధంగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ప్రధానంగా ఇసుక సమస్యతో పాటుగా మద్యం పాలసీ.. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూల విధానం రద్దు పూర్తిగా పార్టీ కార్యకర్తలకు మేలు చేయటం కోసమే అనే అభిప్రాయం జనసేనాని వ్యక్తం చేస్తున్నారు. దీంతో..పార్టీలో కొత్త చేరికలు లేకున్నా..తనతో ఉండే వారితోనే పార్టీ పరంగా ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలని నిర్ణయించారు. దీని కోసం వచ్చే వారం విజయవాడలో అన్ని జిల్లాల అధ్యక్షులతో పవన్ సమావేశం కానున్నారు.

జనంలోకి పవన్..అన్ని జిల్లాల్లో పర్యటనలు..
తాజాగా పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి..ఏపీ ప్రభుత్వ విధానాల పైన పోరాటం చేయాలని నిర్ణయించిన జనసేన అధినేత పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక, ఎక్కువ సమయం జనంలోనే ఉండాలని భావిస్తున్నారు. అందు కోసం జిల్లాల వారీగా పర్యటనలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వచ్చే వారం విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. అందులో ప్రభుత్వ నిర్ణయాల పైన క్షేత్ స్థాయిలో ప్రజల మూడ్ పైన నేతల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇక, నవంబర్ నుండి అన్ని జిల్లాల్లో పర్యటనలు చేయాలని..అక్కడ స్థానిక నేతలతో కలిసి కొన్ని చోట్ల ఆందోళనల్లో పాల్గొనాలని పవన్ భావిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బంది పడుతున్న వివిధ రంగాలకు చెందిన వారికి మద్దతుగా పోరాటాలు చేయాలని డిసైడ్ అయ్యారు. అదే సమయం లో ప్రభుత్వం పైన విమర్శలకే పరిమితం కాకుండా.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పైన పార్టీ శ్రేణులు అంతా కదిలేలా కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, ఇప్పటికే పార్టీలో అనేక మంది ముఖ్య నేతలు వీడినా..వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవన్ చెబుతున్నట్లుగా సమాచారం. తమతో కలిసి వచ్చే వారిని కలుపుకుపోవాలని నిర్ణయించారు.
ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా..
ఏపీలో ఇసుక విధానం ప్రభుత్వం ప్రకటించినా ఇంకా ఇసుక అందుబాటులోకి రాలేదు. దీని పైన తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులు ఇదే విషయం పైన అధికారులను నిలదీసారు. మరి కొద్ది రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, దీని పైన టీడీపీ నిరసనలకు సిద్దం అవుతోంది. దీంతో..లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని వారికి మద్దతుగా పోరాటం చేయాలని జనసేన అధినేత నిర్ణయించారు. అదే విధంగా కొత్త మద్యం విధానం మీద వస్తున్న విమర్శల మీద ఆయన ఫోకస్ చేసారు. దీని వెనుక ఏం జరుగుతుందనేది ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు.
ఇక, తాజాగా ప్రభుత్వం ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేసింది. దీని ద్వారా వైసీపీ సానుభూతి పరులకు మేలు చేయలానే లక్ష్యం ఉందని భావిస్తున్న జనసేన.. దీని పైన నిరుద్యోగులతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించింది. వచ్చే వారం విజయవాడలో జరిగే సమావేశంలో వీటన్నింటికి సంబంధించి.. ఏ జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టాలనే అంశం పైన షెడ్యూల్ ఖరారు కానుంది. నవంబర్ మొదటి వారం నుండి ఇక జనంలోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు.












Click it and Unblock the Notifications