చంద్రబాబు రాగానే ఢిల్లీకి పవన్ ! రేపటి టూర్ కారణమిదే..
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమదైన శైలిలో పనిచేసుకుపోతున్నారు. అయితే ఇరువురు కలిసి పనిచేస్తున్నారా అంటే కచ్చితంగా అవుననే సమాధానం వినిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం వారు చేసుకున్న పని విభజన కావొచ్చు లేదా వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం లేదా మరేదైనా కావచ్చు. ఇలాంటి తరుణంలో ఢిల్లీ టూర్లకు సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేర్వేరుగానే వెళ్తున్నారు.
తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో పెద్దల్ని కలిసి వచ్చారు. ఏపీకి సంబంధించిన పలు కీలక డిమాండ్లను వారి ముందు పెట్టి వచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరహాలో డిప్యూటీ సీఎంను తీసుకెళ్లాల్సి ఉండగా.. చంద్రబాబు మాత్రం విడిగానే తనకు తాను ఢిల్లీ టూర్లకు వెళ్తున్నారు. దీని వెనుక కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

అదే సమయంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన రెండు రోజులకు అంటే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హస్తిన టూర్ కు సిద్దమయ్యారు. రేపు ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగే సమీక్ష సమావేశంలో పవన్ తో పాటు ఇతర రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికి తాగు నీటిని అందించే జలజీవన్ మిషన్ పథకం రాష్ట్రంలో అమలవుతున్న తీరుపై ఈ సమావేశంలో పవన్ వివరించే అవకాశముంది. గతంలో పూర్తికాకుండా మిగిలిపోయిన పనులు, అసంపూర్ణంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కార్యక్రమాలపైనా చర్చించనున్నారు. అనంతరం ఇతర కేంద్రమంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ టూర్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications