జూఎన్టీఆర్ స్థానంలో పవన్, చిరు కంటే: భవిష్యత్తుకి బాట
హైదరాబాద్: ఈ నెల 16వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఫలితాల మాట ఎలా ఉన్నప్పటికీ బిజెపి, టిడిపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. పవన్ 2019 నాటికి జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. టిడిపి, బిజెపికి మద్దతు తెలిపిన పవన్ తన ప్రచారానికి భారీగా ప్రజలను రప్పించగలిగారు.
ఈ ప్రచారం నుండే ఆయన జనసేన పార్టీ విజయ యాత్ర ప్రారంభమైందని ఆయన అభిమానులు చెబుతున్నారు. టిడిపి, బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన పవన్.. ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలో భారీగా ప్రజలను రప్పించగలిగారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు చిరంజీవి కంటే ఎక్కువ పబ్లిక్ను పవన్ రప్పించగలిగారని చెబుతున్నారు.

ఇరు ప్రాంతాల్లోను ఆయనకు ప్రజలు పట్టం గట్టారు. అదే సమయంలో చిరంజీవి సభలు సీమాంధ్రలో పేలవంగా కనిపించాయని చెబుతున్నారు. చిరంజీవితో పాటు బిజెపి తరఫున ప్రచారం చేసిన భానుచందర్, సురేష్, శివాజీ రాజాలు కూడా పబ్లిక్ను రాబట్టలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ప్రజలను రాబట్ట గల్గిన హీరో కేవలం పవన్ కళ్యాణే అంటున్నారు. 2009లో పవన్ ఆయన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు.
ఇప్పుడు ఆయన కాంగ్రెసు పార్టీలో ఉండగా.. పవన్ మాత్రం టిడిపి, బిజెపికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నాడు చిరంజీవి వెంట ఉన్న పలువురు అభ్యర్థులు ఇప్పుడు టిడిపి, బిజెపి అభ్యర్థులుగా పవన్ వెంట ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వంటి పలువురు నేతలు నాడు చిరు, నేడు పవన్ వెంట ఉన్నారు. నాడు చిరు సభలకు, నేడు పవన్ సభలకు వచ్చిన జనాన్ని వారు తరిచి చూస్తున్నారు.
2009లో చిరంజీవి సభలకు కూడా భారీగానే జనాలు వచ్చారు. అయితే ఇప్పుడు చిరు సభలు వెలవెలపోయాయి. అదే సమయంలో ఇప్పుడు పవన్ సభలకు 2009లో చిరుకు వచ్చిన ఆదరణ కనిపించింది. 2009లో చిరుకు ఆదరణ లభించినప్పటికీ ఓటింగ్ విషయానికి వస్తే అది మరో రకంగా కనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోను అదే అవుతుందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. టిడిపి, బిజెపి కూటమికి భారీ మెజార్టీ వస్తే అది పవన్ కళ్యాణ్ను రాజకీయ హీరోగా నిలబెట్టడం ఖాయం.
ఒకవేళ టిడిపి, బిజెపి కూటమికి మెజార్టీ రాకపోయినా... ఆయన క్రౌడ్ పుల్లర్ అయినందున, నేటి పరిస్థితిని అంచనా వేసుకొని 2019 ఎన్నికలకు ఆయన సంసిద్దమయ్యేందుకు ఉపయోగపడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలు టిడిపికి స్టార్ కంపెయినర్లు కాగా, ఇప్పుడు మాత్రం దాదాపు పవన్ ఒక్కరే! బాలకృష్ణ సీమాంధ్రలో మాత్రమే, అదీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహించారు. ఆయన పోటీ చేస్తున్నందున పూర్తిగా ఇతరులకు ప్రచారం చేయలేకపోయారు.












Click it and Unblock the Notifications