ఆ డెడ్ లైన్ పూర్తి; గాంధీ జయంతి సాక్షిగా రంగంలోకి పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వ 'పాలసీ ఉగ్రవాదం' పై ట్వీట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , వైసీపీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం పై పోరాటంలో భాగంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు రోడ్ల మరమ్మతులపై నేరుగా రంగంలోకి దిగనున్నారు. అదే సమయంలో మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆయన వైసీపీ పాలసీ ఉగ్రవాదం అంటూ విరుచుకుపడ్డారు.
రోడ్ల మరమ్మత్తుల కోసం జనసేనాని పోరుబాట .. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు శ్రమదానం
రోడ్ల మరమ్మత్తుల కోసం ఆందోళనలు చేసిన జనసేన, ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది విషయం తెలిసిందే. నాలుగు వారాల గడువు ఇచ్చి వాటికి కనీసం మరమ్మత్తులు చేయాలని విజ్ఞప్తి చేసి నిరీక్షించిన జనసేన, ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్టోబరు రెండవ తేదీన పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయడానికి రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ పై రహదారికి మరమ్మత్తులు చేయనున్నట్టు, నేరుగా పవన్ కళ్యాణ్ ఈ శ్రమదానంలో పాల్గొననున్నట్టు పేర్కొంది.
వైసీపీపై యుద్ధం చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్
ఇక మధ్యాహ్నం రెండు గంటలకు అనంతపురం జిల్లా కొత్త చెరువు లో రహదారికి మరమ్మత్తు చేయనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై యుద్ధానికి దిగినట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతుంది. ఇక తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ కూడా పవన్ అభిమతాన్ని స్పష్టం చేస్తుంది.తాజాగా వైసీపీ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన మరో ట్వీట్ యుద్ధం కొనసాగుతుందని సంకేతాలను ఇస్తోంది. నిన్నమొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల పై పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వ పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటూ పవన్ లేటెస్ట్ ట్వీట్
సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలపై మొదలైన రగడ నేపథ్యంలో, వైసిపి పాలనను తూర్పారబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును, వైసిపి మంత్రుల ప్రవర్తనను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా ఈ దిక్కుమాలిన పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పాలసీ ఉగ్రవాదానికి అన్ని రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వైసిపి ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం దగ్గర పడిందని పేర్కొన్న ఆయన వైసీపీ సర్కార్ పై సమరానికి సిద్ధమైనట్లుగా సంకేతాలిచ్చారు.
ఏపీలో పవన్ వర్సెస్ వైసీపీ మంత్రులు .. ట్వీట్స్ వార్ .. కొనసాగుతున్న రగడ
పవన్ కళ్యాణ్, వైసీపీ మంత్రుల మధ్య సినిమా టిక్కెట్ల విక్రయాలపై మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు పవన్ కళ్యాణ్ ఇటు మంత్రులు ఎవరూ తగ్గకుండా మాటల తూటాలను సంధిస్తున్నారు. తాజాగా ఈ యుద్ధం కాస్త ట్విట్టర్ వార్ గా మారింది. పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా మాటలయుద్దం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ మంత్రి పేర్ని నానిని సన్నాసి అంటూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. సన్నాసిన్నర సన్నాసి వెధవన్నర వెధవ అంటూ పరుష పదజాలంతో దూషించారు. ఇక పవన్ కళ్యాణ్ ఏ మాత్రం తగ్గకుండా వైసిపి నాయకులు పై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ చేసిన పవన్ .. అక్టోబర్ 2 న రోడ్ల కోసం రంగంలోకి
పవన్ చేసిన ట్వీట్ కు అంతే ఘాటుగా పేర్ని నాని కూడా సమాధానమిచ్చారు. తాజాగా వైసీపీ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన మరో ట్వీట్ ఏపీలో యుద్ధం కొనసాగుతుందని సంకేతాలను ఇస్తోంది. ఇక నిన్నటికి నిన్న తుమ్మెదల ఝుంకారాలు నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే అంటూ ఘాటయిన ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమరానికి సై అంటూ మరో ట్వీట్ చేశారు. ఆపై రోడ్ల మరమ్మత్తులకు శ్రమదానం చేయనున్నట్టు తన నిర్ణయాన్ని ప్రకటించారు.