పవన్ కల్యాణ్ మాజీ భార్య, కుమారుడికి సోకిన కరోనా: ఇంట్లోనే ఉన్నా దాడి చేసిన వైరస్
అమరావతి: కరోనా వైరస్ మహమ్మారి మరోమారు దండెత్తింది. భయానకంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడు కావడంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. వరుసగా రెండో రోజు కూడా దేశవ్యాప్తంగా లక్షన్నరకు పైగా కొత్త కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనం. సెకెండ్ వేవ్ తరహాలోనే ఈ దఫా కూడా కరోనా వైరస్ ప్రముఖులపై అటాక్కు దిగింది. పలువురు ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు, సినీ పెద్దలు కోవిడ్ కోరలకు చిక్కారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కోవిడ్ సోకిన విషయం తెలిసిందే. ఫలితంగా- తన సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలకు సైతం ఆయన హాజరు కాలేకపోయారు. హాస్యకిరీటి రాజేంద్రప్రసాద్ కరోనా వైరస్ దాడికి గురయ్యారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్, మంచు లక్ష్మీ, ఖుష్బూ, శోభన, త్రిష, సత్యరాజ్.. ఇలా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు థర్డ్వేవ్లో కరోనా వైరస్ బారిన పడ్డారు.

తాజాగా- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, కుమారుడు అకీరా నందన్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. థర్డ్ వేవ్ పరిస్థితులు భయానకంగా ఉన్నాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ సమయం తామిద్దరం ఇంట్లోనే ఉన్నామని, అయినప్పటికీ.. వైరస్ దాడి చేసిందని చెప్పారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. అది తమపై దాడికి దిగుతుందని హెచ్చరించారు.
తాము ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నామని, కొత్త సంవత్సరం వేడుకలను కూడా ఇంట్లోనే జరుపుకొన్నామని రేణు దేశాయ్ చెప్పారు. అయినప్పటికీ.. వైరస్ బారిన పడాల్సి వచ్చిందని అన్నారు. తమకు నిర్ధారించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తాము హోమ్ ఐసొలేషన్లో ఉన్నామని, వేగంగా కోలుకుంటున్నామని రేణు దేశాయ్ తెలిపారు. ఈ మేరకు ఆమె తన అధికారిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
Recommended Video
ఈ థర్డ్ వేవ్ పరిస్థితులను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. కోవిడ్ ప్రొటొకాల్స్ను తప్పనిసరిగా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించాలని, చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తాను గత ఏడాదే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని వివరించారు. 15 నుంచి 18 సంవత్సరాల్లోపు వారికి టీకా అందుబాటులోకి వచ్చినందున అకీరాకు తొలి డోసు వ్యాక్సిన్ వేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నానని అన్నారు. ఈలోగా పాజిటివ్గా తేలిందని అన్నారు.












Click it and Unblock the Notifications