Pawan Kalyan: సంక్రాంతి బాగా చేసుకోలేకపోతున్నా- రీజన్ చెప్పిన పవన్ ..!
తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత అక్కడికి వెళ్లి బాధితుల్ని పరామర్శించి వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. స్ధానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో ముందస్తు సంక్రాంతి సంబరాలు కూడా ఉన్నాయి. వీటిలో పాల్గొన్న పవన్ .. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అనుకున్న స్ధాయిలో చేసుకోలేకపోతున్నట్లు వెల్లడించారు.
తిరుపతిలో జరిగిన ఘటన తనకు బాధ కలిగించిందని పవన్ తెలిపారు. తనకు పనిచేయడం తప్ప విజయం గురించి తెలియదన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘనవిజయం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. మీరు ఇచ్చిన విజయంతో రాష్ట్రానికి 2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పిఠాపురం ప్రజలకు తెలిపారు. పిఠాపురంలో సంక్రాంతి బాగా చేసుకుందామని అనుకున్నానని, తిరుపతి ఘటనతో తగ్గించి చేస్తున్నానని పవన్ వెల్లడించారు.

తన జన్మ అంతా పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి విజయం అంటే ప్రజల గెలుపు అని పవన్ తెలిపారు. 6 నెలల్లో ఏం చేశారని అడుగుతున్నారని, వాళ్లు ఐదేళ్లలో 260 గోకులాలు నిర్మించారని, 6 నెలల్లోనే తాము 12500 గోకులాలు నిర్మించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం అమూల్ను తీసుకొచ్చి..ప్రభుత్వ డెయిరీలను చంపేసిందని పవన్ ఆరోపించారు. సినిమాలు వదులుకుని ప్రజా సేవ కోసం వచ్చానని తెలిపారు. గత ప్రభుత్వంలో రంగులు వేయడానికి..వేల కోట్లు దుర్వినియోగం చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్యాలెస్లు కట్టుకున్నారని, గ్రామాలకు నిధులు లేవన్నారు. గ్రామాల దుస్థితి గురించి..కేంద్రానికి చెబితే నిధులు ఇచ్చారన్నారు.

పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో పవన్ ఇవాళ మినీ గోకులాన్ని ప్రారంభించారు. శ్రీ కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి రైతు యాతం నాగేశ్వరరావుకి అందజేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో 1.85 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. మినీ గోకులాన్ని ప్రారంభించి నాలుగు గోవులను రైతుకి పవన్ అందజేశారు. ఇదే వేదిక నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో భారీ సంఖ్యలో గోకులాల నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ రికార్డు సృష్టించారు.












Click it and Unblock the Notifications