టిడిపిలో 'పవన్ కళ్యాణ్' చిచ్చు: కాళ్లు విరిచేస్తారన్న టీజీపై ఉమ ఆగ్రహం
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ మధ్య చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తోంది. పవన్ వ్యాఖ్యల పైన టిడిపిలోనే రెండు రకాలుగా స్పందిస్తున్నారు. మంత్రులు సంయమనంతో మాట్లాడుతుండగా, ఎంపీలు ఆయన పైన నిప్పులు గక్కుతున్నారు.
దానిని పక్కన పెడితే.. సొంత పార్టీ నేతలు కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పైన ధనుమాడటంతో సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది.
నా పేరు తల్చుకోకుండా ఉండలేరు: కేశినేని, పవన్పై రెచ్చిపోతున్న ఎంపీలు
పవన్ పైన మాజీ మంత్రి, ఎంపీ టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ఇక్కడ మాట్లాడినట్లుగా తమిళనాడులో మాట్లాడితే జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించి లోపల వేయించేవారన్నారు. చిరంజీవి ప్రజారాజ్యానికి పట్టిన గతే జనసేనకు పడుతుందన్నారు. పవన్ భకర్ణుడిలా నిద్రపోయారా అని నిలదీశారు. ఎంపీలను రాజీనామా చేయమంటున్నారని ఆగ్రహించారు.
టీజీ వెంకటేష్ వ్యాఖ్యల పైన టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీజీ వెంకటేష్ పేరు ఎత్తకుండా ఉమ స్పందించారు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇది టిడిపి అన్నారు. ఉద్దేశ్యపూర్వక రాజకీయం చేసే ఉద్దేశ్యం పవన్ కళ్యాణ్కు లేదన్నారు. తమిళనాడులో వాళ్లేం చేస్తారో, మిమ్మల్ని ఏం చేస్తారో అనే మాటలు అనవసరమన్నారు.
క్రమశిక్షణ గల టిడిపిలో ఉండి టీజీ వెంకటేష్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హోదాపై ఏపీ ప్రభుత్వం ఏ విధమైన పోరాటం చేస్తుందో అదే విషయాన్ని పవన్ చెప్పారన్నారు. ఆ వ్యాఖ్యలను టిడిపి నేతలు తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పారు. హోదాపై చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలన్నారు.
అక్కడ మాట్లాడి ఉంటే పవన్ కళ్యాణ్ కాళ్లు, చేతులు విరిచేవారు: టీజీ
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కొంత సానుకూలంగా స్పందిస్తున్నారు. అదే సమయంలో తమను టార్గెట్ చేసిన పవన్ పైన టిడిపి ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టిడిపిలోనే పవన్ ప్రసంగంపై రెండు రకాలుగా స్పందిస్తున్నారు.